ప్రజాశక్తి – జమ్మలమడుగు రూరల్ కూటమి ప్రభుత్వంలో అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు తగవని సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు దాసరి విజరు, జి ఏసుదాసు సంయుక్తంగా తెలిపారు. శుక్రవారం వారు స్థానిక ఎన్జిఒ కార్యాలయంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రభుత్వ సెక్టార్లో పనిచేస్తున్న స్కీం వర్కర్లు అంగన్వాడీలు, ఆశాలు వర్కర్లు, ఉపాధి హామీ ఫీల్డ్ ఆఫీసర్లు, డ్వాక్రాలపై వ్యవహరిస్తున్న తీరు బాధాకరం అన్నారు. ఉద్యోగాలకు రాజీనామా చేయాలని ఒత్తిడి చేయడం చాలా దుర్మార్గమని అన్నారు. స్కీం వర్కర్లకు జరుగుతున్న అన్యాయాన్ని సిఐటియు నాయకులు సంబంధిత అధికారుల దష్టికి తీసుకువెళ్లగా తమ చేతిలో ఏమీ లేదంటూ బాధ్యత లేని అధికారుల్లాగా సమాధానం చెప్తున్నారన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు కింది స్థాయి రాజకీయ నాయకులు చిరు ఉద్యోగుల పట్ల కనికరం చూపక పోగా ఒత్తిడి చేయడం ఏంటని తెలిపారు. వైసిపి ప్రభుత్వంలో ఇదే అంగన్వాడీలు జీతాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 42 రోజులు అంగన్వాడీలు ధర్నా చేస్తే, జమ్మలమడుగు టిడిపి ఇన్ఛార్జి భూపేష్ ధర్నా సెంటర్ల దగ్గరికి వచ్చి. అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి పార్టీ తీరా అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడం శోచనీయమని వాపోయారు. మాట ఇచ్చిన భూపేష్ రెడ్డి సమస్యలన్నిటిపై సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎ. వినరు కుమార్ , స్వామి, మున్నా, పాల్గొన్నారు.
