ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు జిల్లాలో బిడిఎస్ విద్యార్థి ప్రదీప్ (20) ఆత్మహత్య చేసుకున్నారు. తాను ఉంటున్న హాస్టల్లోని ఐదవ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన ప్రదీప్ నెల్లూరులోని నారాయణ దంత వైద్య కళాశాలలో బిడిఎస్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. అదే కళాశాలలో వైద్యవిద్యనభ్యసిస్తున్న రాహుల్తో ప్రదీప్కు స్నేహం ఉంది. ఇటీవల మిత్రుల మధ్య విభేదాలు రావడంతో ప్రదీప్ను రాహుల్ పక్కన పెట్టారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.