గిరిజనులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి 

Mar 10,2025 13:19 #Prakasam District

సిపిఎం డిమాండ్
ప్రజాశక్తి-టంగుటూరు  : సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర బృందం ఈ రోజు టంగుటూరు మండలంలోని కొణిజేడు గ్రామం లో పర్యటన చేసింది. ఈ బృందంలో సిపిఎం జిల్లా నాయకులు వి.బాలకోటయ్య, టీ.రాము, వి.మోజెస్, ఎస్కె. మీరాస్, ఎం.కోటయ్య పాల్గొన్నారు. కొణిజేడు గ్రామంలో గిరిజనులు సుమారుగా 30 కుటుంబాలు ఉన్నాయి. వీరు క్లీనింగ్ పనులు, గాజులు, పూసలు అమ్ముకోవడం, ఇతర కూలి పనులు చేసుకొంటూ జీవిస్తుంటారు. మాలో కొంత మందికి గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు మిగిలిన వారికీ ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని కాలనీ వాసులు సిపిఎం బృందానికి తెలిపారు. దీని వల్ల కరెంట్ మీటర్లు కూడా లేక చీకట్లో ఉంటున్నాము అని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా గృహాలు కట్టుకొనే స్తోమత లేక పట్టలతో గుడారాలు వేసుకొని ఉంటున్నాము అని తెలిపారు. ఈ సమస్యలను ప్రభుత్వం పరిశీలించి వెంటనే పరిష్కారం చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.
అలాగే హై స్కూల్ ప్రహరీ గోడ దగ్గర ఉన్న యస్ సి కాలనీ లో కొన్ని కుటుంబాలకు మంచి నీటి కుళాయిలు లేక చాలా ఇబ్బంది పడుతున్న విషయం కాలనీ వాసులు సిపిఎం బృందం దృష్టికి తేవటం జరిగింది. 100 మీటర్లు పైపు లైన్ వేస్తే అక్కడున్న కుటుంబాలకు కూడా మంచి నీటి కుళాయిలు బిగించవచ్చు.  ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని సిపిఎం బృందం డిమాండ్ చేసింది.

➡️