సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

-ఏటా 15శాతం వృద్ధి రేటు సాధించాలి

– జిల్లా కలెక్టర్‌ ఎఎస్‌ దినేష్‌ కుమార్‌

ప్రజాశక్తి -పాడేరు : క్షేత్ర స్థాయిలో సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎఎస్‌ దినేష్‌ కుమార్‌ అల్లూరి జిల్లా లోని ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారులు, సబ్‌ కలెక్టర్లు, జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లా అభివద్ధిలో ఐటిడిఎలు భాగస్వాములు కావాలని సూచించారు. ఇక నుండి ప్రతి నెలా నాల్గవ శనివారం ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారుల సమావేశం నిర్వహిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రానున్న ఐదేళ్ళలో ప్రతి ఏడాది 15శాతం వద్ధి రేటు సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి ప్రభుత్వ శాఖలో లక్ష్యాలను మండల, ఐటిడిఎ స్థాయిలో నిర్ణయించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించడానికి విస్తీర్ణత పెంచడం, ఉత్పత్తి పెరిగే చర్యలు తీసుకోవడం, అధిక దిగుబడి వంగడాలు వినియోగం తదితర వాటిపై దృష్టి సారించాలన్నారు. పిఎం కిసాన్‌ ఆదార్‌ సీడింగ్‌ పూర్తీ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఉద్యాన శాఖ చేపట్టిన పసుపు, జీడి, పైనాపిల్‌, కాఫీ, మిరియాలు, పంటల అభివద్ధికి చర్యలు తీసుకోవటంతో పాటు ఆయిల్‌ పాం సాగును పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ కింద చేపట్టిన పనులలో ప్రస్తుతం వస్తున్న రూ.261ల సగటును 290 వరకు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జాబ్‌ కార్డులు లేనివారికి మంజూరు చేయడం, వంద రోజుల పని దినాలను అత్యదిక మందికి కేటాయించడం ద్వారా వృద్ధి రేటు సాధించాలన్నారు. సోషల్‌ ఆడిట్‌ లో గుర్తించిన రికవరీలు చేయాలని, లేదా అందుకు పాల్పడిన వారిని గుర్తించి ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులను గుర్తింపునకు అవసరమైన కిట్లను తెప్పించాలని మలేరియా నివారణకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు, మాతా శిశు మరణాలు తగ్గేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందుకు అవసరమైన శిక్షణలు అందజేయాలన్నారు. నాటు మందుల వినియోగం, నాటు వైద్యం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విద్యా శాఖ సంబంధించి ఉపాధ్యాయులు హాజరు తప్పనిసరిగా వేయాలని, వారి ప్రాంతంలో సిగల్‌ లేకపోటీ సిగల్‌ ఉన్న ప్రాంతాన్ని వారి లొకేషన్‌ మార్చి హాజరు వేయాలని సూచించారు. విద్యార్ధుల హాజరును తనిఖీలు చేసి అవకతవకలుంటే చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడి కేంద్రాలలో హాజరును పర్యవేక్షించాలన్నారు. నిరక్ష్యరాస్యులకోసం ప్రవేశ పెట్టిన ఉల్లాసిని అనే నూతన కార్యక్రమం కింద నిరక్షరాస్య అంగన్వాడి వర్కర్లకు చదవటం రాయటం నేర్పించాలన్నారు. తక్కువ బరువు పిల్లలపై ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలన్నారు.మార్గదర్శి కార్యక్రమం కింద కెరీర్‌ గైడెన్స్‌ అందించాలని, రానున్న ఫిబ్రవరి నెలలో కెరీర్‌ ఫెయిర్‌ నిర్వహించాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్‌, గిరిజన, ఆర్‌అండ్‌బి, పిఐయు శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన బర్త్‌ వెయిటింగ్‌ హాల్సు, మల్టీ పర్పస్‌ భవనాలు, జన్‌ మన్‌ పథకంలో మంజూరు చేసిన పనులను వేగవంతం చేసి నవంబర్‌ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డా. ఎం.జె. అభిషేక్‌ గౌడ్‌, పాడేరు రంపచోడవరం ఐటిడిఎల ప్రాజెక్ట్‌ అధికారులు వి. అభిషేక్‌, కట్టా సింహాచలం, సబ్‌ కలెక్టర్లు సౌర్యమన్‌ పటేల్‌, కల్పశ్రి, డిఆర్‌ఓ బి. పద్మావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️