ప్రజాశక్తి – ఆరిలోవ : మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని విశాఖ కేంద్రకారాగారంలో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిరప్రసాద్, జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రటరీ వి.శేషమ్మ, కెజిహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ పి.శివానంద ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ఖైదీలు తమ హక్కులతో పాటు బాధ్యతలను తెలుసుకోవాలన్నారు. కేంద్రకారాగారంలో పరివర్తన చెంది బయటకు వెళ్లి మంచి జీవితం గడపాలన్నారు. కేంద్రకారాగారం పర్యవేక్షణాధికారి ఎస్.కిషోర్కుమార్ మాట్లాడుతూ మహాత్మ గాంధీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారి అడుగు జాడల్లో మెలగాలన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆశ్రమ వాసులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు పర్యవేక్షణాధికారి ఎం.వెంకటేశ్వర్లు, ఉప పర్యవేక్షణాధికారి ఎన్.కమలాకర్, అధికారులు పాల్గొన్నారు.
