పని ఒత్తిడి తగ్గించాలని ఆశాల నిరసన

Feb 4,2025 21:23

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌:  ఆరోగ్య రంగంలో ప్రాథమిక స్థాయిలో వైద్య సేవలు అందించే ఆశావర్కర్లు తీవ్రమైన పనిభారం, ఒత్తిడితో అనారోగ్యాలకు గురవుతున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ. జగన్మోహన్‌రావు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు మహాలక్ష్మి, వెంకటలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం విజయనగరం అర్బన్‌, రూరల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లపై పని భారం , ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుందని, వేతనాలు మాత్రం పెరగడం లేదన్నారు. ఎన్‌ఎల్‌ఇపి, ఎన్‌సిడి సిడి, టిబి, ఎఎన్‌సి వంటి సర్వేలు , ప్రజల కపాన్ని సేకరించి హాస్పిటల్‌కు పరీక్షల నిమిత్తం తీసుకురావటంతో పాటు మెడికల్‌ కిట్‌ లు కూడా అశా కార్యకర్తలే తెస్తున్నారని, వీటికి అయ్యే ఖర్చులు కూడా భరించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్దిష్టమైన పనిగంటలు ఉండాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేయక తప్పదన్నారు. లేబర్‌ కోడ్లు కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 5న సాయంత్రం 4గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ఆశా వర్కర్లు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పద్మ, కనక మహాలక్ష్మి, నాగమ్మ, పైడ్రాజు, సునీత పాల్గొన్నారు.

➡️