ప్రజాశక్తి-బాపట్ల : యద్దనపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జాగర్లమూడి విలేజ్ హెల్త్ క్లినిక్లో కమ్యూనిటీ హెల్త్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న సరోజినిని ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆయన వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ యద్దనపూడి పిహెచ్సి వైద్యారోగ్య సిబ్బంది జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిహెచ్ఒ అసోసియేషన్ సంఘం నాయకులు మాట్లాడుతూ యద్దనపూడి పిహెచ్సి ఆరోగ్య అధికారి సరోజినీపై నిరాధార మైన ఆరోపణలతో ఆర్డికి సరెండర్ చేశారన్నారు. ఈవిషయపై సరోజినీ ఆర్డిని ఆశ్రయించినట్లు తెలిపారు. ఎలాంటి బదిలీలు లేవని యథా స్థానంలోనే విధులు నిర్వహించాలని ఆర్డి చెప్పినట్లు వారు తెలిపారు. దీంతో సరోజినీ విలేజ్ హెల్త్ క్లినిక్కు వెళ్లగా వైద్యాధికారి హర్ష ఆమెకు పోస్టింగ్ ఇవ్వకుండా అగౌరవంగా మాట్లాడుతూ హేళన చేస్తూ మానసికంగా వేధింపులకు గురి చేసినట్లు తెలిపారు.బాలింతైన సరోజినీ పై ఏమాత్రం కనికరం లేకుండా ఆర్థికంగా మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిపారు. సరోజినీని ఇబ్బందులకు గురిచేస్తున్న వైద్యాధికారి హర్షపై శాఖపరమైన చర్యలు తీసుకొని సరోజినీకి అక్కడే విధులు నిర్వహచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఒ అసోసియేషన్ నాయకులు పులి ప్రేమ్ కుమార్, మౌనిక రెడ్డి, షైనీ మేఘనా, సుగుణ్ కుమార్, ప్రమోద్, అనుదీప్, సుజీవని, రాణి, ప్రవీణ్, రమ్య పాల్గొన్నారు.
