ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నాగార్జున సాగర్ కుడి కాల్వ ఏర్పడి 50 ఏళ్లు దాటినా కాల్వలు పూడిక తీయకపోవడం వల్ల కాల్వ గట్లు తెగటం, ముళ్ల కంపతో కాల్వ నిండిపోవడం, రైతులు తిరగటానికి కాల్వ గట్లపై దారి లేకపవడం వంటి సమస్యలు నెలకొన్నాయని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నరసరావుపేటలోని కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. పిడిఎం నాయకులు వై.వెంకటేశ్వరరావు, ఎన్.రామారావు మాట్లాడుతూ కాల్వ మరమ్మతులు చేపట్టకపోవడంతో చివరి భూములకు నీరు అందడం లేదన్నారు. మరమ్మతులకు తక్షణమే నిధులు కేటాయించాలని, వర్షాలు పడక ముందే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అధికారులకు రైతులు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, అందుబాటులోనూ ఉండడం లేదని విమర్శించారు. కాల్వలపై పర్యవేక్షణ కరువై ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి, విఠంరాజుపల్లి, ఎన్ఎస్పి మైనర్ ఇరిగేషన్ కాల్వ కూడా మరమ్మతులకు గురైందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వగా, సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, వి.కోటనాయక్, షేక్ మస్తాన్వలి, ప్రసన్నకుమార్, మస్తాన్వలి, బి.శ్రీనివాసరావు, థామస్ రైతులు పాల్గొన్నారు.
