ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : జిల్లాలో ఉపాధి కూలీలకు కొత్త పనులు ఇవ్వాలని, పాత మేట్లను కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం జియ్యమ్మవలస మండలం తుంబలిలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు బి.మోహన్ రావు, జి.శ్రీనివాసరావు, ఉపాధి కూలీలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనులు పూర్తయి 2 నెలలు కావస్తోందని, పనులు లేక కూలీలు వలస వెళ్లి పోతున్నారని తెలిపారు. వెంటనే ఉపాధి పనులు కల్పించి, వలసలు నివారించాలని డిమాండ్చేశారు. ప్రభుత్వం మారుతున్నప్పుడల్లా ఉపాధి మేట్లను మారుస్తున్నారని, టిడిపి కూటమి ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందని తెలిపారు. పాత మేట్లను కొనసాగించాలని డిమాండ్చేశారు.
