ఆరేళ్లుగా ఒక్క రూపాయి కూడా పెంచలేదు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వేతనాల పెంపు, రెండేళ్ల నుండి పెండింగ్లో ఉన్న చెల్లింపులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం నరసరావుపేట పట్టణం స్టేషన్ రోడ్డులోని గాంధీ పార్క్ వద్ద ధర్నాచౌక్లో కమ్యూనిటీ హెల్త్ సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు అనుపమ కళ్లకు గంతలు కట్టుకుని మాట్లాడారు. ఆరేళ్ల క్రితం తమను విధుల్లోకి తీసుకున్నప్పుడు రూ.25 వేలు వేతనం ఇచ్చారని, అప్పటి నుండి ఒక్క రూపాయి కూడా పెంచలేదని చెప్పారు. ఈ కాలంలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయి? ప్రజల జీవన ప్రమాణాల్లో ఏం మార్పులొచ్చాయనే విషయం అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలియదా అని ప్రశ్నించారు. సంఘం నాయకులతో సిఎం చంద్రబాబు చర్చించి మానవతాదక్పథంతో కనీసం రూ.5 వేల వేతనం పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. సిహెచ్ఒలను కించపరుస్తూ, కేడర్ల మధ్య చిచ్చుపెట్టే రీతిలో సోషల్ మీడియా వేదికగా నకిలీ ఖాతాలతో పెడుతున్న పోస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నకిలీ ఖాతాలపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రజారోగ్య వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తం ఒక కుటుంబం మాదిరి కలిసిమెలిసి పని చేస్తూ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వినోద్, సాగర్, మస్తాన్, సిహెచ్ఒలు పాల్గొన్నారు.
