ప్రజాశక్తి-లక్కవరపుకోట : సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. శనివారం లక్కవరపుకోటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. సుమారు వందకు పైగా దరఖాస్తులు అందాయి. వివిధ రకాల పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు, ఇంటి స్థలాలు, రోడ్డు నిర్మాణాలు, పలు రకాల విద్యుత్తు సమస్యలు వంటివి తమ దృష్టికి వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వెంటనే ఈ సమస్యల పరిష్కారం దిశగా సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. గ్రీన్ అంబాసిడర్ల సమస్యలపై వినతి గ్రీన్ అంబాసిడర్ల సమస్యలను పరిష్కరించాలని ప్రజా దర్బార్లో ఎమ్మెల్యేకు సిఐటియు ఆధ్వర్యాన వినతి అందించారు. తొలుత స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాడి అప్పారావు ఆధ్వర్యాన గ్రీన్ అంబాసిడర్లు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర్ల సంఘం జిల్లా అధ్యక్షులు దండి శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు చెలికాని ముత్యాలు, గొల్ల కామేశ్వరరావు, సి.హెచ్ అప్పారావు, డి.గంగరాజు, చి.నాగరాజు, సోములు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
