ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : పేద ప్రజల పాలిట అమృత వరప్రదాయినులుగా అన్నా క్యాంటీన్లు విరాజిల్లుతున్నాయని రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ రవీంద్ర పేర్కొన్నారు. గురువారం నగరానికి చేరుకున్న ఆయన కమీషనర్ పల్లి నల్లనయ్యతో కలిసి ఘోషాసుపత్రి వద్దనున్న అన్నా కాంటీన్ ను పరిశీలించారు. పారిశుద్ధ్యం భోజన నిర్వహణ వంటి విషయాలను గమనించారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే క్యూఆర్ కోడ్ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. భోజనం చేస్తున్న ప్రజలను కలిసి అన్నా క్యాంటీన్ల పనితీరు ఎలా ఉందని అడిగారు. దీంతో వారంతా అన్నా క్యాంటీన్లు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ పల్లి నల్లనయ్యతో పాటు రీజనల్ డైరెక్టర్ రవీంద్ర కూడా అన్నా క్యాంటీన్ లో పేదలతో కలిసి భోజనం చేశారు. వేడి పదార్థాలు, రుచికరంగా ఉండడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రీజినల్ డైరెక్టర్ రవీంద్ర మాట్లాడుతూ పేదల ఆకలి బాధలను తీర్చే వర ప్రధాయినిగా అన్నా క్యాంటీన్లు అలరారుతున్నాయని అన్నారు. కేవలం 5 రూపాయలకే రుచి శుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లతో పేద వర్గాలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. దాతలు ముందుకు వచ్చి భూరి విరాళాలను కూడా అందివ్వవచ్చని తెలిపారు. అలాగే శుభ, అశుభ కార్యక్రమాలలో దాతల పేర్లు పైన అల్పాహారం, భోజనం కొరకు విరాళాలు అందివ్వవచ్చునని చెప్పారు.
