తొలిదశలో జనరల్ కేటగిరీలో 2నుంచి 4పోస్టులకు ఎసరు
మలిదశలో టెక్నికల్ కేటగిరి
గ్రామ, వార్డు సచివాలయాల కుదింపే లక్ష్యమా?
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టులు తగ్గిపోనున్నాయి. సచివాలయాల కుదింపే లక్ష్యంగా రేషనలైజేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తొలిదశలో ప్రతి సచివాలయంలోనూ కనీసం 2నుంచి గరిష్టంగా 4పోస్టులకు ప్రభుత్వం ఎసరుపెట్టనుంది. దీంతో మిగతా సిబ్బందిపై పనిభారం పడనుంది. గ్రామ, వార్డు స్థాయిలో పరిపాలన అన్న లక్ష్యం ఆచరణలో ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో అడ్మిన్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రోసిసింగ్ సెక్రటరీ, ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ ఎఎన్ఎం, ఎనర్జీ సెక్రటరీలతోపాటు యానిమల్స్, రెవెన్యూ, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్, ఉమెన్ ప్రొటక్షన్ (మహిళా పోలీస్) కలుపుకుని మొత్తం 10పోస్టులు ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయ శాఖ గత నెలలో విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 2 నుంచి 4పోస్టులు తగ్గనున్నాయి. మలిదశలో మరిన్ని తగ్గే అవకాశాల ఉంటాయని పలువురు విశ్లేషిస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు సేవలందించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మన జిల్లాలో 530 గ్రామ సచివాలయాలు, 96 వార్డు సచివాలయాలు కలిపి మొత్తంగా 636 వరకు ఉన్నాయి. దీంతో, చాలా పనుల కోసం తహశీల్దార్, ఎపిడిఒ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. గ్రామ కార్యదర్శులు విఆర్ఒల కోసం ప్రజలు గ్రామంలోని పెత్తందార్లు, లేదా సర్పంచి, మాజీ సర్పంచుల ఇళ్లల్లోని వెతికాల్సిన అవసరమూ తగ్గిపోయింది. మొత్తం పది మంది సిబ్బంది గ్రామ సచివాలయం కేంద్రంగా అందుబాటులో ఉండడంతో సమయం, వ్యయ ప్రయాసలు తగ్గాయి. ఇటువంటి తరుణంలో సచివాలయ సిబ్బంది, ఆ తరువాత సచివాలయాలను తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తాజా ఉత్వరులు ప్రకారం ప్రస్తుతం ఉన్న సచివాలయాలను ఎ,బి, సి గేటగిరీలుగా విభించించింది. 2,500లోపు జనాభాగల సచివాలయాలను ‘ఎ’ కేటగిరీ కింద పరిగణించనున్నారు. వీటి పరిధిలోని సచివాలయ అడ్మిన్, ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రోసెసింగ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, మహిళా పోలీస్ పోస్టుల్లో కోత పడనున్నాయి. ఈ విధానం అమల్లోకి వస్తే జనరల్ కేటగిరిలో 2పోస్టులు, టెక్నికల్ కేటగిరిలో 4పోస్టులు చొప్పున మొత్తం 6పోస్టులు మాత్రమే ఉంటాయి. ‘బి’ కేటరిగిరీలో 3500లోపు జనాభా ఉటుంది. ఇందులో జనరల్-3, టెక్నికల్ -4 చొప్పున మొత్తం 7పోస్టులు ఉంటాయి. ‘సి’ కేటగిరిలో 351పైబడిన జనాభా ఉంటుంది. ఇందులో జనరల్ 4, టెక్నికల్ 4 చొప్పున మొత్తం 8పోస్టులు ఉంటాయి. ఈలెక్కన మెజార్టీ సచివాలయాల్లో కనీసం 2 నుంచి 4 పోస్టులు తగ్గనున్నాయి. ఈలెక్కన విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని విటి అగ్రహరం -2, అయ్యన్నపేట -2 సచివాలయాల్లో వార్డు అడ్మిన్ సెక్రటరీ, మహిళా పోలీస్ పోస్టులు రద్దు కానున్నాయి. దత్తిరాజేరు మండలం పాచలవలస సచివాలయం బి- కేటరిగికి చేరనుంది. కేటగిరి ప్రకారం అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ పోస్టు రద్దు కానుంది. అదే మండలం వి.కృష్ణాపురం, టి.బూర్జవలస, షికారుగంజి, రాజుల రామచంద్రపురంలో కె.కొత్తవలస, మరడాం సచివాలయాల్లో మహిళా పోలీస్ పోస్టులు ఎగిరిపోనున్నాయి. ఇలా దాదాపు ఎక్కువ గ్రామాల్లో పైన పేర్కొన్న పోస్టుల్లో కొన్ని రద్దు కానున్నాయి.