ప్రజాశక్తి -మధురవాడ : మున్సిపల్ పారిశుధ్య కార్మికుల జీతాల నుంచి 2016 నుంచి2020 వరకు వసూలు చేసిన ఆదాయపన్ను డబ్బులను వెనక్కి ఇవ్వాలని కోరుతూ జివిఎంసి రెండో జోన్ కమిషనర్ ఫణిరామ్కు కార్మికులు వినతిపత్రంఅందజేశారు. జివిఎంసి ప్రజారోగ్య విభాగం అవుట్ సోర్సింగ్ కార్మికులకు 2016లో ఎస్ఎల్ఎఫ్ ద్వారా జీతాలిచ్చేవారని, అప్పట్లో ఐదేళ్లపాటు నెలసరి వేతనాల నుంచి ఆదాయపు పన్ను కట్చేశారన్నారు. ఇది చట్టవిరుద్ధమని సిఐటియు ఆధ్వర్యంలో పోరాటం చేయగా, కార్మికుల నుంచి వసూలు చేసిన ఆదాయపన్ను డబ్బులను తిరిగి చెల్లించాలని సంబంధిత శాఖ డబ్బులు వెనక్కు ఇచ్చేసిందన్నారు. అయితే రెండో జోన్ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు ఐటి డబ్బులు ఇంకా వాపసు చేయలేదని, సాంకేతిక సమస్యలుంటే పరిష్కరించి, వెంటనే బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు చేయాలని కోరారు. జెడ్సికి వినతిపత్రం ఇచ్చిన వారిలో సిఐటియు నేతలు డి.అప్పలరాజు, ఎంవి.ప్రసాద్; సిహెచ్.శేషుబాబు, ఎస్.రామప్పడు, కె.నాగరాజు, కె.ఈశ్వరరావు, జి.కిరణ్, బి.అప్పారావు, డి.సూరిబాబు ఉన్నారు.
జెడ్సికి వినతిపత్రం ఇస్తున్న కార్మికులు