అడ్డగోలుగా కవులవాడ భూముల రిజిస్ట్రేషన్‌

May 8,2025 20:27

ఒకరి వన్‌బి పెట్టి మరొకరి భూములు తప్పుడు రిజిస్ట్రేషన్‌

గగ్గోలు పెడుతున్న బాధితులు

విచారణకు ఆదేశించిన ఎమ్మెల్యే లోకం మాధవి

మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు

ప్రజాశక్తి- భోగాపురం : మండలంలోని కవులవాడ రెవెన్యూ పరిధిలోని భూములు విశాఖ జిల్లా మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డుగోలుగా రిజిస్ట్రేషన్లు జరగడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఒకరి పేరుమీద ఉన్న వన్‌-బిని పెట్టి మరొకరి భూమిని రిజిస్ట్రేషన్‌ చేయడం విశేషం. ఈ విషయం బాధితులకు తెలియడంతో ప్రస్తుతం ఉన్న మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. అంతేకాక ఈ విషయం ఎమ్మెల్యే లోకం మాధవి దృృష్టికి బాధితులు తీసుకువెళ్ళడంతో ఆమె కూడా స్పందించి విచారణకు ఆదేశించారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. తూడెం గ్రామానికి చెందిన పైల రామలక్ష్మి భర్త పైల రమణ పేరు మీద సుమారు 1.26సెంట్లు భూమి ఉంది. దీనికి సంబంధించిన పాస్‌బుక్‌ కూడా రమణ పేరు మీద ఉంది. భర్త పైల రమణ మృతి చెందడంతో భార్య తన పేరు మీద ఆన్‌లైన్‌ చేసేందుకు మ్యుటేషన్‌ పెట్టారు. ఇందులోని 43సెంట్లు రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు ఇసిలో వచ్చింది. తాము ఏనాడూ అమ్మకుండా ఎలా అమ్మకం జరిగిందని నకలు డాక్యుమెంటు తీయగా వేరొకరు పేరు మీద మరొకరు రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తేలింది. ఈ భూమి రిజిస్ట్రేషన్‌ కోసం దువ్వు ఎల్లయ్య పేరు మీద ఉన్న వన్‌ బిని పెట్టి దువ్వు రాంబాబు అనే వ్యక్తి పేరు మీద పైలరమణకు చెందిన 43సెంట్లు భూమిని ఈ ఏడాది మార్చి 24న రిజిస్ట్రేషన్‌ చేసేశారు. అలాగే దువ్వు రాము పేరు మీద ఉన్న భూమికి దువ్వు ఎల్లయ్యకు చెందిన వన్‌బిని పెట్టి దువ్వు రాము అనే వ్యక్తి తన సొంత తండి నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడని ఎల్లయ్య కుమారుడు దువ్వు రాములు ఆరోపించాడు. అలాగే తమ భూమిని కూడా తప్పుడు వన్‌బితో సోదరుడు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని దువ్వు రాములప్పడు కూడా ఆరోపించాడు. భోగాపురంలో పనిచేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ రోషన్‌ కుమార్‌ నిర్వాకమేభోగాపురంలో రిజిస్ట్రేషన్లు చేస్తే తెలిసిపోతుందనే ఉద్దేశంతో ఏకంగా మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇక్కడ సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసిన రోషన్‌ కుమార్‌ మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఇక్కడ ఉన్న పరిచయాలతో కొంత మంది వ్యక్తులు ఆయనను ఆశ్రయించడంతో ఆయన హయాంలోనే మధురవాడలో ఈ రిజిస్ట్రేషన్లు జరిగాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకువెళ్ళడంతో ఆమె వెంటనే స్పందించారు. దీనిపై విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆధికారులను ఆదేశించారు. బాధితులు గురువారం మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రస్తుత సబ్‌ రిజిస్ట్రార్‌ చక్రవర్తికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఉన్నతాధికరుల దృష్టికి తీసుకువెళ్తానని ఆయన బాధితులకు తెలిపారు.

➡️