ఎసిబికి దొరికిన వారంతా ఆ శాఖ నుంచే
ముగ్గురు విఆర్ఒలు, జూనియర్ అసిస్టెంట్ పట్టుబడిన వైనం
ప్రజాశక్తి -డెంకాడ : మండలంలో ఎసిబి దాడుల్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు పట్టుబడ్డారు. కార్యాలయంలో, బయట, నడిరోడ్డుపైనే అడ్డంగా ఎసిబి అధికారులకు దొరికిపోయారు. ఎసిబికి దొరికిన వారంతా రెవెన్యూ శాఖ నుంచే కావడం గమనార్హం. దీన్నిబట్టి రెవెన్యూ శాఖలో అక్రమ వసూళ్లు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. వరుసగా ఒకే కార్యాలయంలో ఎసిబి అధికారులకు లంచం తీసుకుంటుండగా పట్టుబడుతున్నా.. రెవెన్యూలో అవినీతి జాడ్యం మాత్రం ఆగడం లేదు.విశాఖపట్నం, విజయనగరం సమీపంలో డెంకాడ మండలం ఉంది. మండలానికి అన్ని వైపులా జాతీయ రహదారులు, సమీపంలోనే భోగాపురం అరతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం చేపట్టడంతో మండలంలో భూమి ధరలకు రెక్కలొచ్చాయి. ఈ మండలానికి బదిలీపై రావడానికి అధికారులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ద్వారా సిఫార్సులతో పోటీపడి డెంకాడ మండలానికి బదిలీపై వస్తున్నారు. భూముల రేట్లు అమాంతంగా పెరగడంతో ఇదే అదునుగా కొందరు రెవెన్యూ అధికారుల పనితీరులో కూడా మార్పు వచ్చింది. దొరికినకాడికి దోచుకోవడంలో మునిగి తేలుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకుల నుంచి ఎక్కువ మొత్తంలో రెవెన్యూ అధికారులు వసూలు చేస్తూ, వారి పనులు త్వరగా పూర్తి చేస్తున్నారు. ఆ విధంగానే రైతుల వద్ద కూడా డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే రైతుల రెవెన్యూ పనులేవీ చేయడం లేదు. రైతులు లంచాలు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తే, వారిని రోజులు, నెలలు కాదు.. ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పి పంపుతున్నారు.నలుగురు దొరికినా..మండలంలో రెవెన్యూ శాఖలో వరుసగా ఎసిబి అధికారులకు లంచం తీసుకుంటుండగా నాలుగు సార్లు పట్టుపడ్డారు. అయినా సరే రెవెన్యూ అధికారుల తీరు మారడం లేదు. తహశీల్దార్ కార్యాలయంలో మొదట జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా కార్యాలయంలోనే ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఒక మహిళా విఆర్ఒ లంచం తీసుకుంటుండగా ఎసిబికి దొరికిపోయింది. మరో విఆర్ఒ తహశీల్దార్ కార్యాలయం బయట లంచం తీసుకుంటుండగా రెండుసార్లు దొరికిపోయాడు. తాజాగా నడిరోడ్డుపై విజయనగరంలోని దాసన్నపేట వద్ద రైతు వద్ద నుంచి విఆర్ఒ రూ.13 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. తన తండ్రి పేరు మీద ఉన్న 28 సెంట్లు భూమిని తల్లి పేరిట మ్యుటేషన్ చేయడానికి రూ.13 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబికి దొరికిపోయాడు. ఒకపక్క వరుసగా ఎసిబి దాడుల్లో పట్టుబడుతున్నా రెవెన్యూ అధికారుల పనితీరు మారడం లేదని మండల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు తీరు మార్చుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.