ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విప్లవ జ్యోతి అని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ కొనియాడారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ, జాతికి అల్లూరి చేసిన సేవలను కొనియాడారు., అల్లూరి చేసిన స్వాతంత్య్ర పోరాటం ఎందరో వీరులకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు. సెట్విజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఆర్ఒ ఎస్.శ్రీనివాస మూర్తి, జెడ్పి సిఇఒ బివి సత్యనారాయణ, డిపిఒ టి.వెంకటేశ్వర్రావు, జెడిఎ విటి రామారావు, సెట్విజ్ సిఇఒ సోమేశ్వర్రావు, జిల్లా పర్యాటకాధికారి కుమారస్వామి, సమగ్ర శిక్ష ఎపిసి డాక్టర్ రామారావు, డిబిసిడిడబ్ల్యూఒ జ్యోతిశ్రీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ కవిత పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో..
పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి ఎస్పి వకుల్ జిందల్ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ స్వాతంత్య్ర సాధన కోసం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విప్లవ పందాను ఎన్నుకున్నారన్నారు. ప్రజల హక్కుల కోసం, స్వాతంత్య్ర పోరాటం కోసం బ్రిటీష్ సామ్రాజ్యమనే మహాశక్తిని ఆయన ఢ కొన్నారన్నారు. ఆయన చూపిన తెగువ, పట్టుదల మనందరికి ఆదర్శనీయ మని, స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పి జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నగర పాలక సంస్థ అధికారులు నివాళి
విప్లవ జ్యోతిగా, పోరాట యోధునిగా, మన్యం వీరునిగా అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయు డని నగర మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి,ఘనంగా నివాళులర్పించారు. సహాయ కమిషనర్ సిహెచ్ కె.అప్పలరాజు, మున్సిపల్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగరాజు, ఇతర సిబ్బంది కూడా నివాళులర్పించారు. మేయర్ మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తితో అంకితభావంతో మరిన్ని సేవలు అందించాలని అన్నారు. కార్యక్రమం లో రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, మేనేజర్ ప్రసాదరావు, టిపిఆర్ఒ సింహాచలం పాల్గొన్నారు.
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమం
అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా గురజాడ గ్రంధాలయం వద్ద అల్లూరి చిత్రపటానికి డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ హరీష్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగించి, తెలుగు వారి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన విప్లవ వీరుడు అని కొనియాడారు. నేటి యువత సమాజంలోని అన్యాయాలను ఎదుర్కోవడానికి ఆయన పోరాట ధోరణిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. 1924 మే7న బ్రిటీష్ సైనికుల తూటాలకు బలి అయిన అల్లూరి త్యాగభావం నేటి యువతకు ప్రేరణనిస్తుం దన్నారు.కార్యక్రమంలోని రామ్ శ్రీ, ఆదిత్య యువత పాల్గొన్నారు.