రహదారులు దారుణం

May 7,2025 21:18

ఏజెన్సీలో అధ్వానంగా రోడ్లు 

పనులు అర్ధాంతరంగా వదిలేసిన వైనం

రాళ్లు తేలిన రహదారులతో అవస్థలు

నిత్యనరకం అనుభవిస్తున్న గిరిజనం

ప్రజాశక్తి-సీతంపేట : గిరిజన తండాల్లో రహదారులు దారుణంగా మారాయి. కొన్ని రహదారులు రాళ్లు తేలిపోతే, మరికొన్ని రోడ్లు అర్ధాంతరంగా నిధులు లేక నిలిచిపోయాయి. ఇంకొన్ని రహదారులు అటవీశాఖ అభ్యంతరాలు తెలపడంతో ఆగిపోయాయి. ప్రభుత్వాలు మారినా గిరిజనుల రహదారి సమస్య మాత్రం అలాగే ఉండిపోతోంది. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ముందు రహదారి ఉండాలి. అత్యవసర సమయంలో అంబులెన్స్‌, అగ్నిమాపక శకటం వంటివి వెళ్లాలంటే రహదారి తప్పనిసరి. ఇప్పుడే ఇలా ఉంటే వర్షాకాలంలో మరింత దారుణంగా ఉంటుంది. అలాంటిది ఇప్పటికీ గిరిజన గ్రామాల్లో రహదారులు లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీతంపేట ఐటిడిఎ పరిధిలో కనీసం 150 రహదారులు వరకు వేయాల్సి ఉంది. అధికారిక లెక్కల ప్రకారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని 20 మండలాల్లో 104 రహదారులకు ప్రతిపాదనలు పంపించారు. సీతంపేట ఏజెన్సీలో బెనరాయి జలపాతానికి సిసి రహదారికి అటవీశాఖ అభ్యంతరాలు తెలపడంతో నిలిచిపోయింది. భామిని మండలంలో కోటకొండ నుంచి మనీగ రహదారి కూడా అటవీ శాఖ అభ్యంతరం వల్లే ఆగిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో కూడా కొన్ని రహదారులు అటవీశాఖ అభ్యంతరాలతో నిలిచిపోయాయి.సీతంపేట ఏజెన్సీలో పివి ఈతమానుగూడ పంచాయతీలో సలభంపాడు నుంచి కొత్తగూడ, తుంబలి నుంచి సన్నాయిగూడ రహదారులు మెటల్‌ వేసి వదిలేశారు. రాజుగాడిగూడ నుంచి గూడంగి మూడు కిలోమీటర్లు రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారు. పులిపుట్టి నుంచి జరడ కాలనీ మీదుగా చిన్నబగ్గ ప్రధాన రహదారి వరకు రాళ్లు తేలిన రోడ్డుపై నడవాల్సిన దుస్థితి దాపురించింది. ముకుందపురం రోడ్డుకు రాళ్లు వేసి వదిలేశారు. దోనుబాయి పంచాయతీలో కోదులు వీరఘట్టం నుంచి దాసుగుమ్మడ, అంబలకండి, కుసుమూరు నుంచి చెక్కాపురం, మేకవ నుంచి రూపాయి వరకు రహదారులు లేకపోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. సామరెల్లి నుంచి పుప్పాడ, గెద్దకోల నుంచి పెదపల్లకివలస లింక్‌ రోడ్లు వేయాల్సి ఉంది. దుగ్గి నుంచి వనిజ రహదారి వేస్తే సీతంపేట, జియ్యమ్మవలస మండలాల గిరిజనులకు ప్రయోజనం చేకూరుతుంది. దబర నుంచి దబరగూడ రహదారి అర్ధాంతరంగా నిలిచిపోయింది. దారపాడు పంచాయతీలో దంజుపాయి నుంచి భూతాలగూడ రోడ్డు 2017లో సగం చేసి వదిలేశారు. ఇంతవరకు పూర్తి చేయలేదు. గోలుకుప్పగూడ నుంచి రామానగరం గెడ్డ వరకు బిటి రోడ్డు పెచ్చులూడిపోయింది. రాళ్లు తేలి దారుణంగా తయారైంది. దీంతో ఆదివాసీలకు ఇబ్బందులు తప్పడం లేదు. గోలుకుప్పగూడ నుంచి జగత్‌పల్లి, దిశరగూడ వరకు రోడ్డు పనులు ప్రారంభించి, మధ్యలో వదిలేశారు. ఏడాది గడుస్తున్నా పూర్తి చేయలేదు. ఆడలి నుంచి పొంజాడ వరకు గతంలో రోడ్డు ప్రారంభించి, వదిలేయడంతో వర్షాలకు కొట్టుకుపోయింది. కోడిశా జంక్షన్‌ నుంచి కడగండి వరకు బిడి రోడ్డు మరమ్మతులకు గురైంది. ఈ రోడ్డు వేస్తే నాలుగు మండలాలకు ప్రయోజనం చేకూరుతుంది. మర్రిపాడు నుంచి పూతికవలస వరకు బిటి రహదారి మరమ్మతులకు గురైంది. దుగ్గి నుంచి రాయిలంక వరకు రాళ్లు తేలిన రహదారిపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముత్యాలు జంక్షన్‌ నుంచి కోతాం రహదారి సగం చేసి వదిలేశారు.

రాళ్లు తేలిన రహదారిపై నడవలేం

గిరిజన గ్రామాలకు రహదారి లేకపోవడంతో రాళ్లు తేలిన రహదారిపై నడవాల్సి వస్తోంది. అత్యవసర సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అటవీ ఉత్పత్తులు సంతకు తీసుకొని వెళ్లలేని పరిస్థితి.

– కూరంగి వెంకినాయుడు, సర్పంచ్‌, దోనుబాయి

 

రహదారులు వేయాలి

ఏజెన్సీలో రాళ్లు తేలిన రహదారిపై నడవలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఐటిడిఎలో రోడ్లు వేయాలని అధికారులకు వినతులు సమర్పించాం. రహదారి లేని గిరిజన గ్రామాలకు రోడ్లు వెంటనే మంజూరు చేయాలి. సగం పనులుచేసి వదిలేసిన రహదారులను పూర్తి చేయాలి.

– జీలకర్ర సుందరమ్మ, సర్పంచ్‌, ధారపాడు

104 రహదారులకు ప్రతిపాదనలు

సీతంపేట ఐటిడిఎ పరిధిలోని 20 మండలాల్లో 104 రహదారులకు రూ.10 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అందులో పార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు మండలాల్లో 82 రహదారులు, శ్రీకాకుళం జిల్లాలో 16 మండలాల్లో 22 రోడ్లు ఉన్నాయి. నిధులు మంజూరైతే రెండేళ్లలో పూర్తి చేస్తాం.

-పి.రమాదేవి, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌,ఐటిడిఎ,సీతంపేట

➡️