ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఆప్కాస్లో లేని మున్సిపల్ కార్మికులను ఆప్కాస్ చేర్చి రూ.21 వేలు వేతనం ఇవ్వాలని ఏపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) పల్నాడు జిల్లా గౌరవాధ్యక్షులు షేక్ సిలార్ మసూద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిలార్ మసూద్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. కారుణ్య నియామకం కింద విధుల్లోకి తీసుకున్న కార్మికులకు రూ.12 వేలు మాత్రమే ఇస్తే వారి కుటుంబాలు ఎలా గడవాలని అడిగారు. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం తప్పదన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో తాతపూడి మల్లయ్య, యోహాను, విజయలక్ష్మి, జీవరత్నం నవీన్ ఉన్నారు.
