ప్రజాశక్తి- రామచంద్రపురం (చంద్రగిరి) : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులకు సిఎం చంద్రబాబు శంకుస్థాపనలు చేశారు. సుమారు రూ. 4.27 కోట్లతో నిర్మించనున్న 33/కెవి సెమీ ఇండోర్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. జాతీయ ఉపాధి హామీ చట్టం కింద నారావారిపల్లి గ్రామ పరిధిలోని మూడు సచివాలయల పరిధిలో 26 అభివృద్ధి పనులు రూ.3.21కోట్ల పనులకు శిలాఫలకం ఆవిష్కరించారు. శ్రీసిటీ సౌజన్యంతో ఎ.రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్టేట్ ఆఫ్ ఆర్ట్ కింద ఆదర్శవంతమైన పాఠశాలగా రూ.1.10 కోట్లతో అభివృద్ధి చేసేందుకు పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, ఐఎఫ్పి ప్యానెల్స్, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, ఎఐ రోబోటిక్ ల్యాబ్, క్రీడా సామాగ్రి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులకు శంకుస్థాపన చేశారు. నారావారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎనిమిది అంగన్వాడీ కేంద్రాలలోని ఐదేళ్ల లోపు పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడానికి కేర్ అండ్ గ్రోత్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గ్రామీణ మహిళలు ఇంటి వద్ద నుండే కిరాణా షాపులకు వస్తువులను సరఫరా చేసే సౌలభ్యం కల్పించడానికి ఈజీమార్ట్, డిఆర్డిఎ వెలుగు సంస్థ మధ్య ఒప్పంద కుదుర్చుకున్నారు. నారావారిపల్లి సమీపంలోని ఐదు గ్రామాల్లోని 200 మంది మామిడి రైతులతో ఎఫ్పిఒ ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా వారికి అందజేశారు. ప్రభుత్వ స్కీంల వినియోగంతో ఇన్ర్ఫ్రాÛస్ట్రక్చర్, మార్కెటింగ్ అనుసంధానంతో బిగ్ బాస్కెట్, రిలయన్స్, ప్రాసెసింగ్ యూనిట్లకు నేరుగా మార్కెటింగ్ చేసుకోవడం వలన మధ్యవర్తులు లేకుండా కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని ప్రైమరీ ప్యాకింగ్ అండ్ గ్రేడింగ్ చేసుకుని నేరుగా వారు అమ్ముకునేందుకు ఈ ఎఫ్పిఒ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సిఎం సూచించారు కార్యక్రమంలో జిల్లా ఎపిఎంఐపి అధికారి సతీష్, సిఎండి ఎపి ఎస్పిడిసిఎల్ సంతోష్ రావు, పిడి డ్వామా శ్రీనివాస ప్రసాద్, జిల్లా మహిళ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని జయలక్ష్మి, కేర్ అండ్ గ్రో ఫౌండర్ డాక్టర్ మేఘన, డిఆర్డిఎ వెలుగు పీడీ శోభన్ బాబు, ఈజీమార్ట్ ఫౌండర్ అండ్ సిఇఒ వెంకట్ నల్లపాటి, జిల్లా ఉద్యానశాఖ అధికారి దశరథ రామిరెడ్డి పాల్గొన్నారు.
సంక్రాంతి సంబరాల సందర్భంగా నారావారిపల్లెలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ పాల్గొన్నారు. ఈ పోటీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, బాలకృష్ణ భార్య వసుంధర, వారి కుటుంబ సభ్యులు తిలకించారు. క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు, మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు.