ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : కరోనా సమయంలో విశేష సేవలు అందించారంటూ నాడు సిఎం, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పొగడ్తలతో చప్పట్లు కొట్టారని, ఇప్పుడు అదే చేతులతో తమ పొట్ట కొడుతున్నారని మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో వారు చేపట్టిన నిరసన బుధవారం 49వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కంచాలు మోగిస్తూ అమ్మా జీతం, అయ్యా ఉద్యోగం అంటూ మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వినూత్నంగా ర్యాలీ చేశారు. అనంతరం జాతిపిత విగ్రహం చుట్టూ కంచాలు మోగిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు షేక్ సిలార్ మసూద్, కార్యదర్శి ఎ.సాల్మన్ మాట్లాడుతూ ఆరేళ్ల నుండి విధులు నిర్వహిస్తున్న కార్మికులకు నెల మొత్తం పని చేసినా సగం రోజులకే వేతనాలు ఇస్తున్నారని, మిగిలిన వేతనం ఎవరు కాజేస్తున్నారో తెలియడం లేదని అన్నారు. ఈ మాట అడిగినందుకే పనులకు రావొద్దంటూ నిలిపేశారని వాపోయారు. ఆప్కాస్లో ఉన్న మిగిలిన కార్మికులతో పాటు రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్ ఉన్న కార్మికులను బదిలీ కార్మికులు అనడం దుర్మార్గమన్నారు. వైసిపి హయాంలో తాము చేపట్టిన నిరసనలకు మద్దతు తెలిపిన ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తమ గోడు వినిపించుకోవడం లేదని, ప్రతిపక్షంలో ఉంటే ఒకలా అధికారంలో ఉంటే మరోలా ప్రజా ప్రతినిధుల వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు. కార్మికులందర్నీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు వ్యక్తులకు రోజుకు రూ.700 ఇచ్చి పనులు చేయిస్తున్నారని, అవే వేతనాలు తమకు ఇవ్వమని అడిగితే వివక్ష, నిర్లక్ష్య ధోరణి ఎందుకని ప్రశ్నించారు. కార్మికులకు పనిభద్రత కల్పించాలని, శ్రమ దోపిడిని ఆపాలని డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు దిగివచ్చి సమస్యలు పరిష్కరించేంత వరకూ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
