ప్రజాశక్తి-యర్రగొండపాలెం : విద్య ప్రారంభానికి ముందుగా చిన్నారుల్లో ఆసక్తి, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పాఠశాల సంసిద్ధత ఉత్సవం యర్రగొండపాలెం పట్టణంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంఈవో ఆంజనేయులు, ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ఎం పద్మావతి, జిల్లా ఐటీసీ ప్రథమ్ కో-ఆర్డినేటర్ ఎస్ వెంకట్రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యా చైతన్యాన్ని గ్రామస్థాయిలో విస్తరించేందుకు పట్టణమంతా విద్యా స్ఫూర్తిని కలిగించే ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముందుగానే తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రికల ద్వారా సమాచారం ఇచ్చి కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరారు. పూర్వ ప్రాథమిక విద్య పూర్తిచేసిన చిన్నారులు తమ తల్లిదండ్రుల సమక్షంలో రిజిస్ట్రేషన్ స్టాల్ వద్ద తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం సమగ్ర అభివృద్ధి స్టాల్ వద్ద చిన్నారుల అభ్యాస నైపుణ్యాలను పరిశీలిస్తూ, వారు భవిష్యత్ విద్య కోసం సిద్ధంగా ఉన్నారా అన్న దానిపై సమగ్రంగా సమీక్ష చేశారు. కాగా కౌన్సెలింగ్ స్టాల్ ద్వారా తల్లిదండ్రులకు వారి పిల్లల బలాలు, మెరుగుపరచవలసిన ప్రాంతాలపై వివరమైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంఈవో ఆంజనేయులు, సిడిపిఓ పద్మావతి పిల్లలు ప్రథమ తరగతిలో చేరే ముందు వారు ఎటువంటి విషయాలను నేర్చుకోవాలి, దానికోసం తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు, విధానాలు గురించి స్పష్టంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిన్నారుల కోసం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. వారిని సత్కరించి, గుర్తింపు సర్టిఫికెట్లు అందజేశారు. చిన్నారుల నడక, గాన ప్రదర్శనలు, చిన్న చిన్న ప్రదర్శనలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తమ పిల్లల అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసిన తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో ఎంఈఓ ఆంజనేయులు, సిడిపిఓ పద్మావతి, జిల్లా ఐటీసీ ప్రథమ్ కోఆర్డినేటర్ వెంకట్రావు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు పద్మజ, సుబ్బమ్మ, హైమావతి, మరియకుమారి, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు, పాల్గొన్నారు.
