ప్రజాశక్తి-పుల్లలచెరువు: మండల కేంద్రమైన పుల్లలచెరువు అంగన్వాడీ కేంద్రాల్లో పాఠశాల సంసిద్ధత ఉత్సవాన్ని శుక్రవారం తహశిల్దార్ కె వెంకటేశ్వర్లు, ఐసిడిఎస్ సూపర వైజర్ నర్రా శివలక్ష్మి, విఆర్వో వసుంధర దేవి, జిల్లా ఐటీసీ ప్రథమ్ కోఆర్డినేటర్ ఎస్ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఊరంతా ర్యాలీ నిర్వహించి తల్లిదండ్రులు, గ్రామస్తులందరికీ ఆహ్వాన పత్రికల ద్వారా కార్యక్రమానికి ఆహ్వానం అందజేశారు. పాఠశాల సంసిద్ధ ఉత్సవంలో పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేసిన పిల్లలు తమ తల్లిదండ్రుల సమక్షంలో రిజిస్ట్రేషన్ స్టాల్ వద్ద నమోదు అయ్యారు. అనంతరం సమగ్ర అభివృద్ధి స్టాల్ వద్ద వారి అభ్యసన నైపుణ్యాలను పరిశీలించి కౌన్సెలింగ్ స్టాల్ ద్వారా తల్లిదండ్రులకు వారి పిల్లల బలాలు, మెరుగుపరచవలసిన అంశాలపై సవివరంగా వివరణ ఇచ్చారు. జిల్లా ఐటీసీ ప్రథమ్ కోఆర్డినేటర్ ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ పిల్లలు జూన్ 12న ప్రథమ తరగతిలో చేరేలోపు ఎటువంటి అభ్యాసంపై దృష్టి పెట్టాలి అన్న విషయంపై తల్లిదండ్రులకు స్పష్టంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన చిన్నారులందరికీ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి వారిని సర్టిఫికెట్లతో సత్కరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల అభివృద్ధిని ప్రత్యక్షంగా గమనించి హర్షం వ్యక్తం చేశారు.
