ప్రజాశక్తి-యర్రగొండపాలెం : తెల్ల బంగారంపై ఆశలు పెంచుకొని పత్తిసాగు చేస్తున్న రైతులకు వచ్చే ఖరీఫ్ సీజన్లో విత్తన భారం తప్పేలా లేదు. ప్రతియేటా విత్తన ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ లేదు. దీంతో ప్రైవేటు కంపెనీల విత్తనాలు కొనుగోలు చేయడం వల్ల పత్తి రైతులకు విత్తన మోత తప్పడం లేదు. తాజాగా 2025-26 సంవత్సరానికి బీటీ-2 పత్తి విత్తన 475 గ్రాముల ప్యాకెట్ ధరను రూ.901గా నిర్ణయిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.864 ఉండగా, ఈసారి రూ.37 అదనంగా పెంచుతూ నిర్ణయించింది. 2019లో పత్తి విత్తనాల ప్యాకెట్ ధర రూ.710, 2020లో రూ.730, 2021లో రూ.767, 2022లో రూ.810, 2023లో రూ.853, 2024లో రూ.864, ప్రస్తుతం రూ.901 చొప్పున పెరిగింది. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 18,302 హెక్టార్లలో పత్తి పంటను సాగు చేశారు. అయితే ఈ ఏడాది మిర్చి పంట సాగు చేసిన రైతులకు ఆశించిన దిగుబడి రాకపోవడంతో పాటు ధర భారీగా తగ్గడంతో మిర్చి పంటను సాగు చేసిన రైతులంతా పత్తి పంటను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు 35 వేల హెక్టార్లకు చేరనున్నట్లు వ్యవసాయాధి కారులే అంచనాలు వేస్తున్నారు. దీంతో పెరిగిన పత్తి విత్తనాల ధరలు రైతులపై భారం కానున్నాయి. ధరలు పెరచడం బాధాకరం బాశం రమణారెడ్డి, రైతు, మురారిపల్లి అసలే వ్యవసాయం గిట్టుబాటు కాక నానా ఇబ్బందులు పడుతున్న రైతులపై పత్తి విత్తన ప్యాకెట్ల ధర పెంచడం పుండు మీద కారం చల్లినట్లే. నేను ప్రతి యేటా ఐదు ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తుంటాను. 15 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం. అంటే విత్తనాల కోసం అదనంగా రూ.500కు పైగానే చెల్లించాల్సి వస్తోంది. విధి లేని పరిస్థితుల్లో పత్తి పంటను సాగు చేస్తున్నాం. ఏటా నష్టాలు చవి చూస్తున్నాం. ఇప్పటికైనా పత్తి విత్తన ప్యాకెట్ల ధరలు తగ్గించాలి.
