ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : కార్మికుల శ్రమను దోచి కార్పోరేట్లకు లాభాలు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోందని, ఈ విధానాలకు నిరసనగా ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల కార్మికులు, స్కీం వర్కర్లు పాల్గొనాలని సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ పిలుపునిచ్చారు. సమ్మె జయప్రదం కోసం నరసరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో శుక్రవారంసదసస్సు నిర్వహించగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) పల్నాడు జిల్లా అధ్యక్షులు కెపి మెటిల్డాదేవి అధ్యక్షత వహించారు. ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. లేబర్ కోడ్లు అమలు చేస్తే కార్మికులకు తీవ్ర నష్టమని చెప్పారు. యూనియన్లను రద్దు చేస్తారని, పోరాడే శక్తి నిర్వీర్యం అవుతుందని, ఉద్యోగ భద్రత, ఉపాధి కోల్పోతారని, కార్మికశాఖ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని వివరించారు. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. రూ.26 వేలు వేతనం అమలు చేయాలని, ప్రతినెలా 5వ తేదీన జీతాలివ్వాలని కోరారు. డ్రైవర్లకు ప్రమాదకరంగా మారిన రోడ్డు భద్రత రవాణా చట్టం రద్దు చేయాలన్నారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డి.శివకుమారి మాట్లాడుతూ పని ప్రదేశాలలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని, సామాజిక భద్రత చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. 8 గంటల పని విధానం సక్రమంగా అమలు కాకపోవడంతో కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు. మధ్యాహ్న భోజక కార్మికులకు, ఆశా, అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మాధవి, రమణ, కవిత, కమరున్ సుల్తానా, సుమతి, షేక్ సిలార్ మసూద్, సాల్మన్, షేక్ అబ్దుల్ ఖయ్యుమ్, యామిని, నభీ బాజి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మె నేపథ్యాన్ని వివరిస్తూ ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ప్రజాశక్తి – నకరికల్లు : వ్యవసాయానికి, రైతులకు నష్టం కలిగించే విధానాలకు వ్యతిరేంగా ఈనెల 20న జరిగే సమ్మెలో రైతులు, కౌలురైతులు, కూలీలు పెద్దఎత్తున పాల్గొనాలని కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు నకరికల్లులోని సిఐటియు కార్యాలయంలో రైతు, కౌలురైతు సంఘాల సమావేశం ఇ.అప్పిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాల న్నారు. కొత్త కౌలు రైతుల ముసాయిదా చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులను గుర్తించాలని, వారికి గుర్తింపు కార్డులు, పంట రుణాలు, ఇతర రాయితీలు ఇవ్వాలని కోరారు. ఉపాధి హామీలో జాబ్ కార్డులు ఉన్న అందరికీ పని కల్పించా లన్నారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఇ.లక్ష్మారెడ్డి కౌలురైతు సంఘం మండల కార్యదర్శి జి.పిచ్చారావు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు జి.వెంకటరమణ, ఐద్వా నాయకులు కుమారి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
