ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరులో చారిత్రక నిర్మాణంగా ఉన్న శంకర్ విలాస్ ఆర్వోబి నిర్మాణానికి బుధవారం స్థానిక ఎసి కళాశాల వద్ద శంకుస్థాపన జరగనుంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర మంత్రులు బిసి జనార్ధన్రెడ్డి, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రూ.98 కోట్లతో ఎసి కళాశాల నుంచి అరండల్పేట 9 లైను వరకు బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి నిర్మాణం 1958లో నిర్మించారు. 65 ఏళ్ల తరువాత పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సేతు బంధన్ పథకం ద్వారా రూ.98 కోట్లు నిధులు కేటాయించింది. నాలుగు లైన్ల వెడల్పుతో మొత్తం 930 మీటర్ల పొడవుతో నిర్మాణానికి డిపిఆర్ సిద్ధం చేశారు. బ్రిడ్జికి ఇరు వైపులా 23 అడుగుల చొప్పున సర్వీసు రోడ్డుకు అనుమతి ఇవ్వనున్నారు. బ్రాడీపేట 4 వ లైను, అరండల్పేట 5వ లైను, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మాత్రమే అండర్పాస్కు అనుమతి ఇవ్వనున్నారు. బ్రిడ్జి నిర్మాణం 9 మీటర్ల ఎత్తులో జరగనుంది. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణంపై పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అభ్యంతరాలు తెలిపినా ప్రజా ప్రతినిధులు,అధికారులు పలు మార్పులకు అంగీకరించలేదు. లాడ్జి సెంటరు నుంచి హిందూ కళాశాల వరకు ఐకానిక్ బ్రిడ్జి ప్రతిపాదన 2017లో చేశారని, దీనిని పరిశీలించాలని ప్రజాసంఘాల జెఎసి మొరపెట్టుకున్నా ప్రజా ప్రతినిధులు,అధికారులు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఈ ప్రాజెక్టు మొత్తం 120 అడుగుల రోడ్డు విస్తీర్ణంలో ప్లాను చేశారు. 70 అడుగుల వెడల్పుతో 930 మీటర్ల నిడివితో బ్రిడ్జిని నిర్మించబోతున్నారు. 70 అడుగుల బ్రిడ్జితో రెండు వైపుల ఐదు అడుగుల చొప్పున మొత్తం పది అడుగులు ఫుట్పాత్లు రానున్నాయి. మొత్తంగా 60 అడుగుల వెడల్పుతో నాలుగు లైన్ల బ్రిడ్జినిర్మాణం జరగనుంది. ఎర్త్వాల్తో కట్టే బ్రిడ్జి కనుక అండర్ పాస్లు ఇచ్చిన ప్రాంతం మినహా మిగతా ప్రాంతమంతా రవాణాకు ఆటంకమేనని చెబుతున్నారు. బ్రిడ్జి నిడివి కుదించటం వలన పశ్చిమ వైపు ఎనిమిది తొమ్మిది లైన్ల మధ్య ప్రారంభమై తూర్పు వైపు రాష్ట్ర ప్రాంతీయ గ్రంథాలయానికి అంటే కో-పరేటివ్ సూపర్ బజార్ దగ్గర పూర్తవుతుంది. 23 అడుగుల సర్వీసు రోడ్డు నిర్మించినా డ్రెయిన్లకు కేటాయించిన స్థలం పోను కేవలం 18 అడుగులు మాత్రమే ఉంటోందని దీనిని పెంచాలని కోరినా అంగీకరించలేదు. ఆర్వోబి నిర్మాణం కంటే ఆర్యూబి నిర్మాణం చేపట్టాలనే జెఎసి డిమాండ్ను కూడా పెడచెవిన పెట్టారు. ఇప్పుడు ఆర్యూబి సాధ్యం కాదని ఆర్వోబి నిర్మాణం తరువాత ఆర్యూబి విషయాన్ని పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో వాహనాల రాకపోకలకు ప్రత్యామ్నాయ చర్యలు కూడా నామమాత్రంగానే ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. నిత్యం 50 వేల వాహనాలు ఈ బ్రిడ్జిపై రాకపోకలు కొనసాగించే పరిస్థితుల్లో గుంటూరు, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు మధ్య రాకపోకలకు రాబోయే రెండేళ్లపాటు ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు.
ఎమ్మెల్యే నసీర్ అహ్మద్కు సమస్యలు వివరిస్తున్న జెఎసి నాయకులు
శంకర్ విలాస్ ఆర్ఓబి డిజైన్ మార్చాలి
ప్రజాశక్తి-గుంటూరు : బెటర్ శంకర్ విలాస్ ఫైఓవర్ సాధన జెఎసి నాయకులు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ను మంగళవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఆర్ఓబికి బుధవారం శంకుస్థాపన నేపథ్యంలో జెఎసి నాయకులు కలిసి కొత్త డిజైన్ వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు, సవరణలు, ట్రాఫిక్ సమస్యలు, సర్వీసు రోడ్డు ఇబ్బందులపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆర్అండ్బి ఇచ్చిన నమూనా వల్ల కొన్ని ఇబ్బందులున్నాయని, తాను కూడా కొన్ని సవరణలు సూచించానని, ఒకటి రెండ్రోజుల్లో కేంద్ర మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తామని, అందులో చర్చించి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ముందుగా ఆర్యుబి నిర్మించాలని, అదనపు గ్రాంట్ తెప్పించి ఫ్లైఓవర్ నిర్మాణం జరిగేలా చూడాలని జెఎసి నాయకులు కోరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఎల్.ఎస్.భారవి, మల్లికార్జునరావు, ఎ.హరి, వెంకటరావు, కార్తీక్, శ్రీనివాసరావుమూర్తి ఉన్నారు.
