ప్రజాశక్తి-మార్కాపురం : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, అందులో ప్రధానోపాధ్యాయులు కీలకపాత్ర పోషించాలని మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి బి.శామ్యూల్ జాన్ సూచించారు. స్థానిక జడ్పి బాలుర ఉన్నత పాఠశాలలో డివిజన్లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా శామ్యూల్ జాన్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలోని పాఠశాలలను బలోపేతం చేసేందుకు పాఠశాలల పేరెంట్స్ కమిటీ సహకారం తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది, పూర్వ విద్యార్థుల సహకారంతో సమన్వయం చేసుకోవాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల నమోదు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా చేయాలన్నారు. తమ తమ పరిధిలోని గృహాలను సందర్శించాలని, విద్యార్థుల తలిదండ్రులకు పాఠశాల వసతులు, వనరులు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య వంటి అంశాలను వివరించాలని కోరారు. తమ క్లస్టర్ పరిధిలోని అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు నూరు శాతం పై తరగతులలో చదువు కొనసాగేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్ధానిక జడ్పి బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్రెడ్డి, డివిజన్ పరిధిలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
