ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ … డిసెంబర్ 26 నుంచి జనవరి 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్స్ సమ్మె చేపట్టారు. శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఏ.జగన్మోహన్ మాట్లాడుతూ … రిటైర్మెంట్ బెనిఫిట్స్, మట్టి ఖర్చులు, ఎక్స్గ్రేషియా పెంపు తదితర రాతపూర్వక హామీలకు తక్షణమే జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల వలె 62 సంవత్సరాల వరకు కొనసాగించాలన్నారు. రిటైర్మెంట్ అయిన 12 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. మరణించినవారి కుటుంబంలో పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. జీవో నెంబర్ 12 ప్రకారం ఇంజనీరింగ్, నాన్ పిహెచ్ కార్మికులందరికీ సంక్రాంతి కానుక 1000 రూపాయలు తక్షణమే చెల్లించాలన్నారు. పర్మినెంట్ ఉద్యోగుల, కార్మికుల 3 సంవత్సరాల సరెండర్ లీవ్ డబ్బులు, డీఏ బకాయిలు, చెల్లించాలన్నారు. జి పి ఎస్ అకౌంట్లు తెరవాలన్నారు. జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ ఇతర సిబ్బందికి బేసిక్ వేతనాలు అమలు చేయాలని, వచ్చేది సంక్రాంతి కాబట్టి హెల్త్ అలవెన్స్, జీతాలు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. సమ్మె ఒప్పందాలు అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పనిముట్లు, రక్షణ పరికరాలు ఇవ్వాలన్నారు. ట్రాక్టర్లు ఎక్కించడం, కాలువలు తీయించడం, మట్టిపోగులు ఎత్తించటం వంటి పనుల నుంచి మహిళా కార్మికులను మినహాయించాలని కోరుతున్నామన్నారు. అదేవిధంగా జనవరి 6న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో నెంబర్ 2 ని సవరించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ థర్డ్ పార్టీ ఎన్ఎంఆర్ కార్మికులందరినీ (ఎంటిఎస్) మినిమం టైమ్ స్కేల్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా లో యూనియన్ నాయకులు బి.భాస్కరరావు, బి.రాఘవ, బి.చిన్ని, తిరుమలరావు, కఅష్ణ, పైడిరాజు, కార్మికులు పాల్గొన్నారు.