ప్రజాశక్తి – బద్వేలు మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ పట్టణ కమిటీ అధ్యక్షులు పులి శ్యాంప్రవీణ్ అన్నారు. స్థానిక సిఐటియు పట్టణ కార్యాల యంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు గత సంవత్సరం నిర్వహించిన 17 రోజుల సమ్మె ముగిసి ఏడాది గడుస్తున్నదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఎక్స్గ్రేషియో, దహన సంస్కారాలకు రూ.20 వేలు, ఇంజినీరింగ్ కార్మికుల జీతాలపెంపు, సంక్షేమపథకాలు, పర్మినెంట్ కార్మికులకు సరండర్ లీవ్లు తదితర హామీలకు వెంటనే జిఒలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం గత ఏడాది సమ్మె ముగిసిన రోజు జనవరి 10వ తేదీ అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని కార్మికులను పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా సమ్మెకాలపు ఒప్పం దాల జిఒలు జారీ చేయలేదని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ, ఉన్నతాధికారులను యూనియన్ రాష్ట్ర నాయకత్వం పలు పర్యాయాలు కలిసి విన్నవించినా స్పందన లేదని చెప్పారు. పైగా 2024 జనవరి 24వ తేదీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన సిఫార్సుల ఫైళ్ళను టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే సంబంధిత ఫైళ్లను వెనక్కి తెప్పించుకోవడం జరిగిందని, నేటికి ఫైల్స్ను పరిశీలించి మరల ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు పంపలేదన్నారు. కార్మికుల రిట్కెర్మెంట్ వయస్సును 62 ఏళ్ళకు పెంచడం లేదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా 60 ఏళ్ళకే బలవంతంగా రిటైర్ మెంట్ చేస్తున్నారని, వారి బిడ్డలకు కూడా ఉద్యోగాలు ఇవ్వడంలేదన్నారు. ఈ విధానాలను వెంటనే మానుకోవాలని, ఇంజినీరింగ్ విభాగంలో సుమారు 12 నుండి13 వేల మంది కార్మికులు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని, ఇంటి బాడుగలు, కరెంట్ చార్జీలు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో కుటుంబాలు పస్తులతో గడుపుతున్నారని తెలిపారు. గత సమ్మె సందఠంగా 9 మంది అధికారులతో వేసిన కమిటీ నివేదిక తప్పుల తడకగా ఉన్నదన్నారు. ఇంజినీరింగ్ కార్మికులకు జిఒ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని తెలిపారు. మున్సిపాల్టీలలో దశాబ్ధాల తరబడి పనిచేస్తున్న ఎన్ఎంఆర్, బదిలీ, కోవిడ్ కార్మికులను మున్సిపల్ కార్మికులుగా గుర్తించాచాలని డిమాండ్ చేశారు. క్లాప్ డ్రెవర్లకు జీతాలు పెంచి ఉద్యోగభద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కె.నాగేంద్రబాబు, యూనియన్ పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షులు దియ్యాల హరి, ఉపాధ్యక్షులు దియ్యాల దేవమ్మ, గంటా శ్రీనివాసులు, కోశాధికారి కాలువ శివకుమార్ పాల్గొన్నారు.