ప్రజాశక్తి-యర్రగొండపాలెం : యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. కార్యాలయ ఆవరణం, గదులను, రిసెప్షన్ కౌంటర్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ రికార్డులు, పట్టుబడిన ద్విచక్ర వాహనాలు, పలు ఫైల్స్తో పాటు జనరల్ డైరీ, తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమోదైన కేసులపై ఆరా తీశారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో పెండింగ్ కేసులను తగ్గించాలని తెలిపారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తరచూ విజిబుల్ పోలీసింగ్ చేపడుతూ నేరాలను కట్టడి చేయాలని చెప్పారు. సైబర్ నేరాల అడ్డుకట్టకు అవగాహానే అసలైన అస్త్రం అని వివరించారు. పోలీస్ సిబ్బంది క్రమ శిక్షణా, వృత్తి పట్ట నిబద్ధత, అంకితభావం కలిగి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని చెప్పారు. స్టేషన్లో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారాలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజలకు సీసీ కెమెరాల పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, యర్రగొండపాలెం సిఐ ప్రభాకర్రావు, యర్రగొండపాలెం ఎస్ఐ పి చౌడయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దారవీడు: పోలీస్ సిబ్బంది క్రమశిక్షణ, వృత్తిపట్ల నిబద్ధత, అంకిత భావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ అన్నారు. పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి పెద్దారవీడు, దోర్నాల పోలీస్స్టేషన్లను మంగళవారం ఆయన సందర్శించారు. పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని, గదులను, రిసెప్షన్ కౌంటర్, పాత పోలీస్ క్వార్టర్స్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ రికార్డులు, పట్టుబడిన ద్విచక్ర వాహనాలు, పలు సిడి ఫైల్స్ను, జనరల్ డైరీ తదితర రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని వాటిని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి తక్షణమే ఫిర్యాదుదారులకు పరిష్కారం అందించాలని అన్నారు. జిల్లా ఎస్పీ వెంట మార్కాపురం డిఎస్పీ నాగరాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, వై పాలెం సిఐ ప్రభాకర్రావు, పెద్దారవీడు ఎస్ఐ అనిల్కుమార్, దోర్నాల ఎస్ఐ మహేష్, సిబ్బంది ఉన్నారు. తర్లుపాడు: తర్లుపాడు పోలీస్ స్టేషను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. రహదారులపై ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టాలని, అక్రమ రవాణాలను అరికట్టాలని, బెల్ట్ షాపులను కట్టడి చేయాలని సిబ్బందికి సూచించారు. గ్రామాలలో గొడవలు, సైబర్ నేరాలు, ఫేక్ లోన్ యాప్ల గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఈ సందర్భంగా తర్లుపాడు గ్రామస్తులు ఈర్ల వెంకటయ్య, జవ్వాజి విజయభాస్కరరావు, గోసు వెంకటేశ్వర్లు, కోలగట్ల భాస్కర్రెడ్డి, పోలేపల్లి జనార్ధన్ ఎస్పీ దామోదర్ను దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. గ్రామంలో ప్రధాన రహదారుల ఆక్రమణలు తొలగించే సమయంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా రక్షణ కల్పించాలని వారు ఎస్పీని కోరారు. ఆక్రమణలు తొలగింపు సమయంలో బందోబస్తు పటిష్టంగా నిర్వహించాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి బి లక్ష్మీనారాయణ, సీఐ టి వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ సిఐ రాఘవేంద్ర, ఎస్ఐ బ్రహ్మనాయుడు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
