ప్రజాశక్తి-చందర్లపాడు (ఎన్టిఆర్) : ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్రగా మార్చుకొనుట కొరకు చందర్లపాడు మండలంలోని అన్ని గ్రామాలలో చెత్త ఏరివేత పై ప్రత్యేక కార్యక్రమం జరుగుతుందని ముప్పాళ్ళ పంచాయితీ కార్యదర్శి యం. సాయిరామ్ తెలిపారు. ఇంచార్జ్ ఎంపిడీవో ఎస్.వి నాంచారయ్య ఇవోపిఆర్డి పి.ఏసుబాబు మాట్లాడుతూ గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పనిచేస్తుందని ఆ చెత్తను అక్కడికి చేరవేసే విధంగా ఏర్పాట్లు చేశామని ఇంటింటికి తిరిగి అవగాహన పెంచేలా తడి పొడి చెత్తను తీసుకెళ్లి సంపద కేంద్రంలో వేస్తామని అక్కడ సేంద్రీయ ఎరువు తయారవుతుందని దాని పై అవగాహన కల్పిస్తున్నామని, గ్రామ ప్రజలు అందరు కూడా చెత్త ను రోడ్ల ప్రక్కన కాలువలో వేయకుండా ఇంటి వద్దనే తడి పొడి చెత్త గా వేరు చేసుకుని పంచాయతీ నుండి వచ్చే క్లాప్ మిత్రలకు ఇవ్వాలని తెలుపడం జరిగినది. కరపత్రాలు,స్టికర్స్ ద్వారా చెత్త నుండి సంపద కేంద్రం గురించి,తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వడంపై ఉపాధి హామీ పనులు వద్దకు వెళ్లి వారికి కూడా ఈ కార్యక్రమం పై అవగాహన కల్పించడం జరిగినది. తద్వారా మన వీధి శుభ్రంగా వుంటుంది,తద్వారా మన గ్రామం కూడా శుభ్రంగా వుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ,సచివాలయ సిబ్బంది, క్లాప్ మిత్రాలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
