పిచికారీకి 157 గ్రామాల ఎంపిక
ఇన్ఛార్జి కలెక్టర్ సేతు మాధవన్
ప్రజాశక్తి-విజయనగరం : మలేరియా నిర్మూలనకు ఇంటి లోపల గోడలపై ఎసిఎం 5 (ఆల్ఫా సైఫర్ మెత్రిన్) స్ప్రే చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ సూచించారు. దీనికోసం జిల్లా వ్యాప్తంగా 157 గ్రామాలను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. వ్యాధి ఎక్కువగా ఉన్న 18 మండలాలకు చెందిన ప్రత్యేకాధికారులు, ఎంపిడిఒలు, ఇఒపిఆర్డిలు, వైద్యాధికారులు, మలేరియా సబ్ యూనిట్ అధికారులతో బుధవారం తమ ఛాంబర్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ, మలేరియా వ్యాప్తిని నిరోధించడానికి మొత్తం 22 పిహెచ్సిల పరిధిలోని 157 గ్రామాల్లో రెండు విడతలుగా ఎసిఎం మందును పిచికారీ చేయనున్నట్లు తెలిపారు. మే 1 నుంచి జూన్ 15 వరకు మొదటి విడత, జులై 1 నుంచి ఆగస్టు 15 వరకు రెండో విడత ఏసిఎం మందును పిచికారీ చేయనున్నట్లు వెల్లడించారు. అన్ని గదుల్లో గోడలమీద ఈ మందును పిచికారీ చేస్తామన్నారు. ఇలా మందు పిచికారీ చేసినప్పుడు ఆ ఇంటి గోడలపై 10 నుంచి 12 వారాలు వరకు ఆ మందు ప్రభావం ఉంటుందని, ఆ లోగా గోడలను కడగడం గానీ, సున్నం వేయడం గానీ చేయరాదని సూచించారు. అందువల్ల ఈ కార్యక్రమానికి ప్రజలనుంచి సంపూర్ణ సహకారం అవసరమని చెప్పారు. సమావేశంలో జిల్లా కేంద్రం నుంచి డిఎంఅండ్హెచ్ఒ డాక్టర్ ఎస్.జీవనరాణి, జిల్లా మలేరియా అధికారి మణి పాల్గొన్నారు.