మౌనం పాటిస్తున్న కలెక్టర్, జేసీ, తదితరులు
పుట్టపర్తి అర్బన్ : పాకిస్తాన్తో జరిగిన యుద్దంలో వీరమరణం పొందిన జిల్లాలోని గోరంట్ల మండలం తల్లి తండాకు చెందిన వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నివాళులర్పించారు. శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో వీర జవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో దేశ రక్షణ కోసం ప్రాణాలు విడిచిన వీర జవాన్ ప్రదర్శించిన ధైర్య సాహసం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ కన్వీనర్ రామాంజనేయులు, ఎల్ఐసి నరసింహులు, సురేష్ నాయుడు, సామకోటి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ లో నివాళులు… కలెక్టరేట్లో వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికికలెక్టర్ టిఎస్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో పాటు పలువురు జిల్లా అధికారులు నివాళులర్పించారు. వీర జవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ సరిహద్దులలో మురళి నాయక్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఒ విజయ సారధి, డిఆర్డిఎ పీడీ నరసయ్య, డిపిఆర్ఒ వేలాయుధం, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కొత్తచెరువు : పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో వీరమరణం పొందిన గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళి నాయక్కు స్థానికులు ఘన నివాళి అర్పించారు. నాలుగు రోడ్ల కూడలిలో జాతీయ జెండాలు పట్టుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమరా చంద్ర, మాణిక్యంఇస్సాకు, నాయుడు, నాగేంద్ర, శేఖర్, సాయి, పాపన్న, మిల్ట్రీ సాయి, చలపతి, రఫీ, వలిపి శ్రీనివాసులు, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
చిలమత్తూరు : పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన గోరంట్ల మండలం కల్లి తాండకు చెందిన వీర జవాన్ మురళి నాయక్కు మండల కేంద్రంలో సిపిఎం నాయకులు నివాళులు అర్పించారు. నాయకులు ప్రవీణ్ కుమార్, వెంకటేష్, గ్లోబల్ కంప్యూటర్ సంస్థ నాగేంద్ర, విద్యార్థులు మురళినాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
పుట్టపర్తి రూరల్: దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ వీరమరణం యావత్ దేశానికి గర్వకారణమని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న అన్నారు.భారత్-పాక్ యుద్ధంలో సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లి తండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ వి.రత్న శుక్రవారం గ్రామానికి వెళ్లి జవాను తల్లిదండ్రులను ఓదార్చారు. జిల్లా పోలీస్ శాఖ తరపున జవాన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం వీరజవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం జరుగుతున్న యుద్ధంలో రాష్ట్రానికి చెందిన వీరజవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారని, యువ జవాను మురళీ నాయక్ పేరు భారతీయ చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని అన్నారు. ప్రభుత్వ లాంచనాలతో వీర జవాన్ అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు, ఎఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్బి సిఐ బాలసుబ్రమణ్యం రెడ్డి, సిఐ శేఖర్, ఎస్బి ఎస్ఐ ప్రదీప్ కుమార్, అర్ఐ వలి, మహేష్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.
పెనుకొండ: మారుమూల చిన్నతండాలో పుట్టిన మురళినాయక్ దేశం గర్వపడే వీరుడయ్యారని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత కొనియాడారు. వీర జవాన్ మురళినాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ శుక్రవారం మంత్రి సవిత ఆధ్వర్యంలో పట్టణంలోని టిడిపి కార్యాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్, దర్గా సర్కిల్, శ్రీకృష్ణదేవరాయలు కూడలి, గాంధీ సర్కిల్ మీదుగా తెలుగుతల్లి విగ్రహం వరకూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ జవాను మురళినాయక్ దేశాన్ని కాపాడాలి.. త్రివర్ణ పతాకం తలవంచకుండా నిలబెట్టేందుకు వీర మరణం పొందారన్నారు. జవాను మరణం కాదు ఇది దేశభక్తికి నివాళి, త్యాగం, ధైర్యం, గర్వం అన్నారు. మురళినాయక్ లాంటి వీరుల త్యాగం ఎప్పటికీ మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మడకశిర రూరల్ : పాకిస్తాన్ దేశంతో జరుగుతున్న యుద్ధంలో జిల్లాకు చెందిన మురళినాయక్ వీరమరణం పొం దారు. జవాను వీరమరణం పట్ల ఎపి కుంచితి కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు నళిని రంగేగౌడ, ఎడిసిసి బ్యాంక్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఆనందరంగారెడ్డి నివాళుర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళినాయక్ కుటుంబానికి యావత్ భారతదేశం అండగా ఉంటుందని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. హిందూపురం : పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో వీర మరణం పొందిన మురళీ నాయక్కు టిడిపి తదితర పార్టీల నాయకులు నివాళి అర్పించారు. స్థానిక అంబేద్కర్ సర్కిల్ లో మురళీనాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కారక్రమంలో మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్, టీడీపీ సత్య సాయి జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట ఆంజినప్ప,కౌన్సిలర్లు, టీడీపీ సీనియర్ నాయకులు, టిడిపి కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.