ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం కొత్త తరహా రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది ప్రస్తుతం కలర్ ఫోటోలతో ఉన్న రేషన్ కార్డులు ఉన్నాయి. ఇకనుంచి వాటిని డిజిటల్ రూపంలోకి మార్చేందుకు చర్యలు చేపట్టింది క్యూఆర్ కోడ్ కలిగి ఏటీఎం కార్డు తరహాలో రేషన్ కార్డు రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఉన్న పాత పద్ధతిలో కాకుండా కొత్త తరహాలో రేషన్ కార్డు రానుంది. బుధవారం నుంచే కొత్త కార్డు దరఖాస్తులకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 31 లోపు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. జీఎస్టీడబ్ల్యూఎస్ ఫార్మెట్లో ఈ దరఖాస్తు అందజేయాల్సి ఉంటుంది. కొత్త రేషన్ కార్డులు కోసం జిల్లా ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు కొత్త వాటి కోసం అనుమతినిచ్చింది. ఈసారి ఇచ్చే కార్డులు కూడా పాత వాటిలాగా కాకుండా మార్పులు చేయాలని చూస్తోంది. స్మార్ట్ కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు మంజూరుకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. క్యూఆర్ కోడ్ కలిగిన ఏటీఎం తరహాలో ఉన్న రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్టు సమాచారం. అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 6,67,289 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో అంత్యోదయ కార్డులు 53,050 కార్డులు ఉన్నాయి. ఎన్ఎఫ్ఎస్ఎ కార్డులు 5,54,310 ఉన్నాయి. ఇతరులు 59,908 కార్డులు ఉన్నాయి.కొత్త కార్డులు, మార్పులు.. చేర్పులు ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వబోతున్న రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించింది. ఏడు రకాల సేవలను ఇప్పుడు లబ్ధిదారులు వినియోగించుకోవచ్చు కొత్త రేషన్ కార్డు, అదనంగా చేర్పులు, కార్డ్ స్లిట్టింగ్, కార్డును సరెండర్, అదనంగా సభ్యుల చేర్పు, అడ్రస్ మార్పు, ఈకెవైసి సదుపాయాలను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులను ఆయా సచివాలయాల పరిధిలో ప్రజల నుంచి తీసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.