ప్రజల ఐక్యతను దెబ్బతీస్తున్న బిజెపి : కెఎ.పాల్‌

విలేకరులతో మాట్లాడుతున్న కెఎ.పాల్‌

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌

దేశంలో మతం పేరుతో ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసేలా కేంద్రంలోని బిజెపి పాలన కొనసాగుతోందని ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కెఎ.పాల్‌ అభిప్రాయ పడ్డారు. గురువారం అనంతపురం జిల్లాకు వచ్చిన ఆయన అనంత ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. హిందూ, ముస్లింల మధ్య ఐక్యతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల అడుగులకు మడుగులు వత్తేలా చంద్రబాబు, పవన్‌, జగన్‌లు రాష్ట్రంలో ఉండడం విచాకరం అన్నారు. రాయలసీమ ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న రూరల్‌ డెవలెప్‌మెంట్‌ ట్రస్ట్‌(ఆర్‌డిటి)కి సంబంధించిన ఎఫ్‌సిఆర్‌ఎ రెన్యూవల్‌ కాకుండా కేంద్రం అడ్డుకోవడం సరికాదన్నారు. రెండు నెలల్లోపు రెన్యువల్‌ ప్రక్రియ చేయకపోతే ఈ విషయంలో తానే చొరవ చూపి దీనిని పూర్తి చేయిస్తానన్నారు. ప్రపంచ దేశాల నుంచి సాయం తీసుకొచ్చే శక్తి సామర్థ్యాలు తనకు ఉన్నాయని దేశం, రాష్ట్రాల అభివృద్ధికి తన వంతు కృషి అందిస్తానన్నారు. ఇటీవల మరణించిన ఫాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతిపై అనుమానాలు ఉన్నాయని, ఆయన మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం చేసి నిజాలను బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. భారతదేశం, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం ఆపడానికి తాను పాకిస్తాన్‌ వెళుతున్నట్లు తెలిపారు.

➡️