టౌన్హంద్రీనీవా కాలువను పరిశీలిస్తున్న కలెక్టర్, ఎస్పీ
ప్రజాశక్తి-ఉరవకొండ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉరవకొండ పట్టణం వద్దనున్న హంద్రీనీవా కాలువ నుంచి రాగులపాడు పంప్ హౌస్ వరకు హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ వెడల్పు పనులను కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్, ఎస్పీ పి.జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్లు స్థానిక అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఉరవకొండ పట్టణం, చిన్నముష్టూరు గ్రామం వద్దనున్న హంద్రీనీవా ప్రధాన కాలువ వంతెన నుంచి కాలువ మీద లత్తవరం బ్రిడ్జి, పిసి.ప్యాపిలి, వజ్రకరూరు మండలంలోని రాగులపాడు పంప్ హౌస్ వరకు కాలువ వెడల్పు పనులను పరిశీలించారు. ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్, లత్తవరం గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు గురించి అధికారులతో కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కాలువ ద్వారా ఎన్ని చెరువులకు కాలువ ద్వారా నీరు అందిస్తున్నారు.. పంప్ హౌస్ లో ఎన్ని రోజులు నీటిని పంప్ చేస్తారన్న తెలుసుకున్నారు. అనంతరం రాగులపాడు వద్ద హెలిప్యాడ్, సభ నిర్వహించేందు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించి స్థానిక అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ రాజా స్వరూప్ కుమార్, ఆర్డీవో ఎస్ఆర్బీఎస్ శ్రీనివాస్, ఆర్అండ్బి ఎస్ఈ రాజగోపాల్, సిఐలు చిన్నగౌస్, మహానంది, రాజు, మస్తాన్, కెనాల్ ఇన్ఛార్జి డిఇ పివి.రమణ, తహశీల్దార్లు మహబూబ్ బాషా, ఎంపిడిఒ రవిప్రసాద్, జెఈలు సురేష్ నాయక్, భార్గవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
మంత్రి పయ్యావుల సమీక్ష
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో సోమవారం అనంతపురం నగరంలోని ఆర్అండ్బి అతిథి గహంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ పి.జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్లతో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం చేపట్టే ఏర్పాట్లను మ్యాప్ ద్వారా మంత్రికి కలెక్టర్ వివరించారు. హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను ఎక్కడ పరిశీలించాలి.. హెలిప్యాడ్ ఎక్కడ ఏర్పాటు చేయాలి.. సభ ఎక్కడ పెట్టాలి.. తదితర ఏర్పాట్ల వివరాలను మంత్రి ఆరా తీశారు. ఈ సమావేశంలో హెచ్ఎన్ఎస్ఎస్ సిఈ నాగరాజు, ఎస్ఈ రాజా స్వరూప్ కుమార్, ఆర్డీవో ఎస్ఆర్బిఎస్ శ్రీనివాస్, పాల్గొన్నారు.