సమస్యలు పరిష్కరించకుంటే మెరుపు సమ్మెకు సిద్ధం : సిఐటియు

హిందూపురంలో సమస్యలపై ఎంహెచ్‌ఒ శోభన్‌ రెడ్డికి వినతిని ఇస్తున్న నాయకులు

ప్రజాశక్తి-హిందూపురం

పురపాలక సంఘంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే మెరుపు సమ్మెకు సిద్ధం అవుతావని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి జగదీష్‌ తెలియజేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం పారిశుధ్య కార్మికులు మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, మున్సిపల్‌ కమిషనర్‌ ఛాంబర్‌ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జగదీష్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి స్థానికంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పలు రకాలుగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టామన్నారు. అయినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయంగా కార్మికులకు రావలసిన హెల్త్‌ క్లైమ్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తో పాటు మతి చెందిన, 60 సంవత్సరాలు దాటిన కార్మిక కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. ఇప్పటివరకు బకాయి ఉన్న పిఎఫ్‌, ఈఎస్‌ఐ నిధులను ఆయా సంస్థలకు జమ చేయాలన్నారు. అనంతరం మున్సిపల్‌ ఆరోగ్య అధికారి శోభన్‌ రెడ్డికి వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు మల్లికార్జున, రామచంద్ర, రంగనాథ్‌, గుర్నాథ్‌, కవిత తదితరులు పాల్గొన్నారు.

          పుట్టపర్తి అర్బన్‌ : కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలని, మున్సిపల్‌ ఒప్పంద కార్మికులను పర్మినెంట్‌ చేయాలని మున్సిపల్‌ వర్కర్ల యూనియన్‌, సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం ముందు కార్మికులు నిరసన తెలిపి కమిషనర్‌ ప్రహ్లాదకు వినతి పత్రం సమర్పించారు. సిఐటియు మండల కార్యదర్శి పైపల్లి గంగాధర్‌ మాట్లాడుతూ కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్‌ కోడ్స్‌గా మార్చడానికి కుట్ర చేస్తోందన్నారు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 20వ తేదీ ప్రజా, కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. అందులో కార్మికులు పాల్గొంటున్నట్లు కమిషనర్‌కు సమ్మె నోటీసులు సమర్పించారు. లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలని, ఒప్పంద కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని, ఆప్కాస్‌ను ప్రయివేట్‌ ఏజెన్సీలకు అప్పగించవద్దని, కనీస వేతనాలు అమలు చేయాలని, వయోపరిమితి 62 ఏళ్లకు పెంచాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్ల యూనియన్‌ నాయకులు నాగార్జున, నరసింహులు, పెద్దన్న, రామయ్య, గోవిందు పాల్గొన్నారు.

➡️