హామీ మేరకు ఇళ్లస్థలాలివ్వాలి : సిపిఎం

Apr 21,2025 21:42

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

                   కదిరి టౌన్‌ : గతంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని సిపిఎం పట్టణ కార్యదర్శి జిఎల్‌. నరసింహులు డిమాండ్‌ చేశారు. కదిరి రూరల్‌ కుమ్మరవాండ్లపల్లి పేదలకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని కోరుతూ డిప్యూటీ తహశీల్దార్‌ ఈశ్వర్‌కి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో అర్హులైన నిరుపేదలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు,పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు మంజూరు చేసి పక్కాగృహాలు నిర్మించి ఇస్తామనిచంద్రబాబు నాయుడు చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్న ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. వేల రూపాయలు అద్దెలు కట్టలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా సిపిఎం జిల్లా కమిటీ ఈనెల 26వ తేదీన అన్ని తహశీల్దార్‌ కార్యాలయాల ఎదుట రిలే దీక్షలకు పిలుపునిచ్చిందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సాంబశివ, రాంమోహన్‌, ముస్తాక్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️