స్త్రీ నిధి రుణాలు పంపిణీ

May 8,2025 22:02

 స్త్రీ నిధి మెగా చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత

              చెన్నేకొత్తపల్లి : స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రామగిరి మండల కేంద్రంలో డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి రుణాలు పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా మొత్తం 106 సంఘాల్లోని 398మంది మహిళలకు రూ. 3.41కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ ఒకప్పుడు వంటిళ్లు, పొలం పనులు తప్ప వేరే లోకం తెలియని మహిళలను పురుషులతో సమానంగా వ్యాపారం చేసే స్థాయికి తీసుకొచ్చింది చంద్రబాబేనన్నారు. మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లించాలని సూచించారు. ఈ రుణాలను ఇంట్లో వస్తువులు కొనుగోలు చేసేందుకు కాకుండా స్వయం ఉపాధి కోసం వినియోగించుకోవాలన్నారు. వైసిపి హయాంలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. ఈ నెలలోనే అమ్మకు వందనం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా వారందరికీ రూ. 15వేల చొప్పున అందజేస్తామని అలాగే అన్నదాత సుఖీభవ డబ్బు ప్రతి రైతుకు అందుతుందని అన్నారు. కొత్త రేషన్‌ కార్డులకు కూడా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చన్నారు. మరోవైపు కొత్త పింఛన్లు కూడా త్వరలోనే వస్తాయని చెప్పారు.

➡️