సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ చేతన్
ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్
జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన భూసేకరణకు పనులు జాప్యం లేకుండా సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్ టిఎస్.చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎన్హెచ్ 342 ఎన్హెచ్ 716 జాతీయ రహదారులు, వివిధ భూ సేకరణకు సంబంధించి పనులు పురోగతిపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ కేటాయింపు ప్రతిపాదనలపైన వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిబంధనల మేరకు సంబంధిత అధికారులు నివేదికను అందజేయాలని ఆదేశించారు. ఎన్హెచ్ 342 ప్యాకేజీ కింద బుచ్చయ్య గారి పల్లి ప్యాకేజీ కింద, కప్పలబండకు సంబంధించి భూ సేకరణ పనులు పెండింగ్లో ఉన్నాయని వాటిని వేగవంతంగా పరిష్కరించాలన్నారు. నవంబర్ ఒకటవ తేదీ లోపల జాతీయ రహదారుల పనులు పూర్తి చేయాలన్నారు. డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు సమన్వయం చేసుకుని పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు ఆనంద్, సువర్ణ, శర్మ, ఎన్హెచ్ పీడీ అశోక్ కుమార్, మల్లికార్జున రావు, నాగరాజు, సుజాత, ఆర్అండ్బి ఎస్ఈ సంజీవయ్య, డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రామసుబ్బయ్య పాల్గొన్నారు.