రైతు సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం

Apr 11,2025 21:46

జెండా ఆవిష్కరణలో పాల్గొన్న నాయకులు

                     ధర్మవరం రూరల్‌ : రైతు సమస్యల పరిష్కారం కోసం రైతుసంఘం ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటాలు చేస్తున్నామని ఆసంఘం నాయకులు పేర్కొన్నారు. అఖిల భారత రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసంఘం నాయకులు శుక్రవారం ధర్మవరం తహశీల్దార్‌ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, జిల్లా ఉపాధ్యక్షులు ఏ మారుతి మాట్లాడుతూ రైతు సంఘం ఆవిర్భావం, పోరాటాలు, విజయాల గురించి వివరించారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ రైతులకు అండగా నిలబడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు ఎస్‌హెచ్‌. బాషా, వెంకటస్వామి, హరి, సిఐటియు నాయకులు జెవి రమణ, టి అయూబ్‌ఖాన్‌, ఎల్‌ ఆదినారాయణ, ఎస్‌. హైదర్‌వలి, రైతులు శంకర ,ఆది, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కదిరి టౌన్‌ : ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బాలింతలకు ఏపీ రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు సుధాకర్‌ రెడ్డి, ఉదరు కుమార్‌, రఫీ, ఆంజనేయులు, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారానికి రైతుసంఘం చేస్తున్న పోరాటాలను వివరించారు.

➡️