మెమొంటో అందుకుంటున్న చితంబరరావు
ధర్మవరం రూరల్ : మండల పరిధిలోని నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు, గురువు షిండే చిదంబర రావుకు ఇటీవల బొంబాయిలో ఘన సత్కారం లభించింది. ఈ సందర్భంగా చిదంబరం మాట్లాడుతూ ఇటీవల బొంబాయి లోని కేటీ ఏరియాలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి తోలుబొమ్మలాట కళాకారుల ప్రదర్శన నిర్వహించారన్నారు. ఈ ప్రదర్శనలో తనతో పాటు 8మంది కళాకారులు తోలు బొమ్మల ప్రదర్శనను నిర్వహించామన్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రదర్శించిన తమ తోలుబొమ్మలాట అందరిని విశేషంగా ఆకట్టుకుందని తెలిపారు. తాను 48 సంవత్సరాలుగా తోలుబొమ్మలాట కళాకారుడుగా, గురువుగా ఉంటున్నానని చెప్పారు. భారత దేశంతో పాటు ఇతర దేశాలైన లండన్, జర్మనీ, స్పెయిన్, ఈజిప్ట్, మెక్సికో, ప్యారిస్, ఫ్రాన్స్, ఉమెన్ మస్కట్ దేశాలలో ప్రదర్శన నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ప్రధాని మోడీతో కూడా తాను ప్రశంసలు అందుకున్నానని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కళాకారులను మరింత ఆదుకునే దిశలో చర్యలు చేపట్టాలని తెలిపారు.