తాడిపత్రిలో హై టెన్షన్‌..!

ప్రజాశక్తి -అనంతపురం ప్రతినిధి

         తాడిపత్రిలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతల మధ్య మాటలతో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. హైకోర్టు అనుమతితో తాడిపత్రిలో అడుగు పెడతానని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలో అడుగుపెట్ట నివ్వబోనని జెసి ప్రభాకర్‌ రెడ్డి బాహాటంగానే హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాగిపత్రిలో ఎప్పుడే ఏమి జరుగుతోందో అన్న టెన్ష్‌న్‌ అందరిలోనూ కన్పిస్తోంది.

            సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం వైసిపి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టలేదు. ఇటీవల ఆయన్ను తాడిపత్రిలోకి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కోర్టు అనుమతి మేరకు తాను తాడిపత్రిలోకి వెళ్తానంటూ పెద్దారెడ్డి ప్రకటించారు. అయితే గతంలో తాము అధికారంలో లేనప్పుడు పెద్దారెడ్డి తమపై దౌర్జన్యాలకు పాల్పడ్డారని మున్సిపల్‌ ఛైర్మన్‌ జెసి. ప్రభాకర్‌రెడ్డి చెబుతున్నారు. దీనికి ప్రతిగా తాము ఇప్పుడు ఆయన్ను రానివ్వకుండా అడ్డుకుంటామని ప్రకటించారు. తమపై తప్పుడు కేసులు పెట్టి కుటుంబాన్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశారని జెసి చెప్తున్నారు .ఆనాడు తమకు కూడా కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని తెలిపారు. అయినా రానివ్వకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రయత్నించారని ఆరోపించారు. కాగా వైసిపి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం తాను తాడిపత్రి వచ్చి తీరుతానని చెబుతున్నారు. ఆయన మూడు రోజుల్లో జిల్లా ఎస్పీని కలిసి హైకోర్టు ఉత్తర్వును అందజేసి తాడిపత్రికి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఇచ్చే సమయాన్ని బట్టి ఈనెల 8 లేదా 9వ తేదీల్లో తేదీల్లో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తారని ప్రచారం నడుస్తోంది.

గతంలో వారు… ఇప్పుడు వీరు..!

            1980 దశకం నుంచి ఓటమన్నది ఎరగకుండా తాడిపత్రిలో జెసి కుటుంబం ఓటమన్నది ఎరగకుండా అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వచ్చింది. తొలిసారిగా 2019 ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి జెసి కుటుంబంపై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసిపి అధికారంలోకి రాగానే జెసి కుటుంబంపై కేసుల పర్వం మొదలైంది. బిఎస్‌ త్రీ వాహనాల కొనుగోళ్లలో అవకతకులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో ప్రభాకర్‌ రెడ్డి ఆయన తనయుడు అస్మిత్‌ రెడ్డిలు జైలుకు వెళ్లి వచ్చారు. ఇదే సమయంలోనే జెసి.ప్రభాకర్‌రెడ్డి ఇంటికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లడం అప్పట్లో రాష్ట్ర స్థాయిలోనే పెద్ద దుమారం రేపింది. ఇక 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పెద్దారెడ్డి ఓటమి చెందారు. రాష్ట్రంలోనూ వైసిపి అధికారం కోల్పోయింది. తాడిపత్రి ఎమ్మెల్యేగా జెసి.అస్మిత్‌ రెడ్డి గెలుపొందారు. టిడిపి అధికారంలోకి రావడంతో జెసి.ప్రభాకర్‌ రెడ్డి పెద్దారెడ్డికి గట్టిగానే కౌంటర్‌ ఇవ్వడం ప్రారంభించారు. పెద్దారెడ్డి హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీసే పని చేయడమే కాకుండా, ఆయన్ను తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వనని సవాల్‌ విసిరుతున్నారు. ఇప్పటి వరకు అయితే పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టలేదు. ప్రస్తుతం హైకోర్టు తీర్పు నేపథ్యంలో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యేగా తాను నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్తున్నారు. ఇలా ఇద్దరు నేతల మధ్య రాజకీయ వేడి ఒక రకంగా యుద్ధాన్ని తలపిస్తోంది. ఘర్షనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి పోలీసులు అనుమతిస్తారా.. లేదా..? లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

➡️