పేదలకు పొజిషన్ సర్టిఫికెట్లను అందజేస్తున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి అనగాని సత్యప్రసాద్
ప్రజాశక్తి-హిందూపురం
రాష్ట్రంలో హిందూపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే థ్యేయంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. సోమవారం ఆయన నియోజవకర్గంలోని హిందూపురం, లేపాక్షి మండలాల్లో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో కొట్టునూరు గ్రామం కొల్లకుంట కాలనీలో 237 ఇంటి పట్టాలకు పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చిలమత్తూరులో నూతన సిసి రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాల్లో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్.రాజు, బాలకృష్ణ సతీమణి వసుంధర, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్.చేతన్ పాల్గొన్నారు. హిందూపురంలో ఇళ్ల పట్టాలకు పొజిషన్ సర్టిఫికెట్ల మంజూరు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకునేలా కూటమి ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు. వచ్చే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవను అమలు చేస్తున్నామని చెప్పారు. అమరావతితోపాటు రాజధానిని కలుపుతూ జరిగే అన్ని రహదారుల నిర్మాణ పనులు త్వరగా జరగాలని ప్రధాని మోదీ కోరుతున్నారని ఆమేరకు పనులు వేగవంతం అవుతాయని చెప్పారు. హిందూపురం నియోజకవర్గ ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలకు సర్వ హక్కులూ కల్పించాలనే ఉద్ధేశంతో హిందుపురం పట్టణం కొట్నూరు పంచాయతీ కొల్లకుంట కాలనీ పేదలకు పొజిషన్ సర్టిఫికెట్లను అందిచామని తెలియజేశారు. ఈ సర్టిఫికెట్ ద్వారా బ్యాంకుల నుంచి రుణం పొందవచ్చని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన సంవత్సరంలోపే హిందూపురం నియోజకవర్గంలో ఎన్ఆర్ఇజిఎస్ నిధులు రూ.50 కోట్లతో ప్రతి గ్రామానికి తారు రోడ్డు. సౌకర్యం, సిసి రహదారులు, డ్రెయినేజీలు ఏర్పాటు చేశామన్నారు. మున్సిపాల్టీలో 38 వార్డుల్లో సిసి రహదారులు, డ్రెయినేజీలు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రూ.92.5 కోట్ల మంజూరు చేయించామన్నారు. ఈ పనులను త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. హిందూపురం పట్టణంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం అంతర్గత పైప్లైన్ నిర్మాణం కోసం రూ.136 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని తెలియజేశారు. ఈ పనులనూ త్వరలో ప్రారంభిస్తామన్నారు. వినాయక నిమజ్జనం చేసే గుడ్డం కోనేరు మరమ్మతులకు ఆహుడా నుంచి రూ.1.50కోట్లు మంజూరు అయ్యాయన్నారు. హిందూపురం నియోజవకర్గంలో సుమారు 2వేల మంది టైలరింగ్లో శిక్షణ ఇచ్చి, కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రానున్న నాలుగేళ్లలో హిందూపురాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్ కుమార్, మున్సిపల్ ఛైర్మన్ డిఇ.రమేశ్, హౌసింగ్ పీడీ, స్పెషల్ ఆఫీసర్ వెంకటనారాయణ, మున్సిపల్ కమిషనర్ సంఘం శ్రీనివాసులు, టిడిపి జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజనప్ప, ఆర్డీవో ఆనంద్ కుమార్, టిడిపి నాయకులు మల్లికార్జున్ గౌడ్, చంద్ర శేఖర్, శివశంకర్, పరిమళ, బేవిన హళ్లి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలో డైనింగ్ హాల్కు భూమిపూజ
చిలమత్తూరు : చిలమత్తూరు మండలంలోని టేకులోడు మహాత్మా జ్యోతిబాపూలే ఎంజెపి గురుకుల పాఠశాలలో రూ.85 లక్షల వ్యయంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) నిధులతో నిర్మించనున్న నూతన డైనింగ్ హాల్ నిర్మాణానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకష్ణ భూమిపూజ చేశారు. ఆర్డిటి సహకారంతో నిర్మిస్తున్న ఈ డైనింగ్ హాల్ విద్యార్థులకు భోజన సౌకర్యాన్ని మెరుగుపరచడంతో పాటు, వారికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుందని ఎమ్మెల్యే బాలకష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శిలు వీరయ్య, శ్రీనివాసరావు, సురేంద్ర, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరీ గంగాధర్, కొడికొండ బాలాజీ, తిప్పారెడ్డి, నందీశప్ప, మల్లికార్జున, శ్రీదేవి, విజరు కుమార్, సర్పంచి బయప రెడ్డి, ఎంపిడిఒ రమణ మూర్తి పాల్గొన్నారు.