వేతనాలివ్వకుంటే పస్తులుంటూ పని చేయాలా..?

పల్లెలు చరుస్తూ నిరసన తెలుపుతున్న శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా కార్మికులు

ప్రజాశక్తి-కళ్యాణదుర్గం రూరల్‌

కార్మికులకు నెలల తరబడి వేతనాలు ఇవ్వకుంటే కుటుంబాలను పస్తులుంచి పనులు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు ప్రశ్నించారు. పెండింగ్‌ వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు గత 33 రోజులుగా సమ్మెలో ఉన్న విషయం తెలిసిందే. కార్మికులు సమ్మె చేస్తున్నా అధికారులు, ప్రభుత్వం స్పందించకపోవడంతో సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లేందుకు సిఐటియు నాయకులు సిద్ధం అయ్యారు. శుక్రవారం నాడు జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రిని కలిసి సమస్యలను విన్నవిస్తామని తెలియజేశారు. గురువారం ఉదయం కళ్యాణదుర్గం ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం నుంచి శ్రీరామిరెడ్డి కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. పల్లెలను చరుస్తూ మా ఆకలి కేకలు ప్రభుత్వానికి పట్టవా అంటూ నినాదాలు చేశారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం వద్ద బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, జిల్లా సహాయ కార్యదర్శి అచ్యుత్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ శ్రీరామిరెడ్డి తాగునీటి సరఫరా కార్మికులకు పెండింగ్‌లో ఉన్న 3. నెలల పిఎఫ్‌, 7 నెలల జీతాలు వెంటనే చెల్లించాలన్నారు. ఈ సమస్యలపై కార్మికులు 33 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచాకరం అన్నారు. ఉరవకొండలో శుక్రవారం జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో కార్మికులు వారి కుటుంబాలతో సహా అక్కడికి వెళ్లి సమస్యలను విన్నవిస్తారన్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు రంగనాధ్‌, శ్రీరామిరెడ్డి కార్మికుల సంఘం నాయకులు వన్నూరుస్వామి, నరేష్‌, గంగాధర్‌, బాషా, నాగరాజు పాల్గొన్నారు.

➡️