పరిశ్రమలకు కేటాయించిన స్థలంలో వెలసిన వాణిజ్య సముదాయ భవనాలు
పరిశ్రమలకు కేటాయించిన స్థలంలో వాణిజ్య సముదాయాలు
ఏపీఐఐసీ ఆదాయానికి గండి
ప్రజాశక్తి-హిందూపురం
హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో ఏపీఐఐసీ నిబంధనలకు పాతర వేశారు. పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య భవన సముదాయాలు నిర్మించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాణిజ్య భవన సముదాయాలు నిర్మించాలంటే నిబంధన మేరకు రెట్టింపు డబ్బు చెల్లించి వాణిజ్యపరంగా భూములను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. పారిశ్రామిక వాడలో ఇలాంటివేవి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏపీఐఐసీలో గతంలో పనిచేసిన కొందరు వాణిజ్య సముదాయాలను నిర్మించి అద్దెలకు ఇచ్చారు. గతంలో ఏపీఐఐసీలో పనిచేసిన ఆ వ్యక్తే ప్రస్తుతం ఆ వాణిజ్య భవన సముదాయాల్లో మద్యం దుకాణం నిర్వహిస్తుండడం గమనార్హం. పారిశ్రామిక వాడలో మద్యం షాపు పెట్టడం బాధాకరమని కార్మిక సంఘాలు, పరిశ్రమల యజమానులు చెబుతున్నా పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదు. సంబంధిత మద్యం దుకాణం గార్మెంట్స్ పరిశ్రమలకు వందల మీటర్ల లోపే ఉంది. ఉదయం, సాయంత్రం మహిళా కార్మికులు ఆ రహదారిలో రాకపోకలు సాగిస్తుంటారని, ఆ సమయంలో మద్యం మత్తులో రోడ్డుపై నిలబడి తమను వేధిస్తున్నట్లు పలువురు మహిళా కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులు ఈ మద్యం షాపును తొలగించాలని, అదే విధంగా నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య భవన సముదాయాలు నిర్మించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు, కార్మిక సంఘాలు, పరిశ్రమల యజమానులు కోరుతున్నారు.