పుట్టపర్తిలో వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు, మహిళలు
పుట్టపర్తి క్రైమ్ : ఇప్పటికే కొనుగోలు శక్తి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సింది పోయి కేంద్రంలోని మోడీ ప్రభుతవం గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి మరింత భారం వేస్తోందని సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా పలు మంల కేంద్రాల్లో గురువారం నాడు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పుట్టపర్తి పట్టణంలోని గణేష్ సర్కిల్లో సిపిఎం, సిఐటియు నాయకులు గ్యాస్ సిలిండర్లను నెత్తిన పెట్టుకని ధర్నా నిర్వహించారు. ‘పెరిగే ధరలకు హద్దే లేదు.. పెంచే వారికి బుద్దే లేదు’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈఎస్.వెంకటేష్ మాట్లాడుతూ ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని విమర్శించారు. సామాన్య ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు ధరలు పెంచడం సరికాదన్నారు. తక్షణం పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి బ్యాళ్ల అంజి, కొత్తచెరువు కార్యదర్శి ముత్యాలు, వ్యవసాయ కార్మిక సంఘం కోశాధికారి వెంకటేష్, మహిళా సంఘం నాయకులు రమాదేవి, శ్రావణి పాల్గొన్నారు. పెనుకొండ టౌన్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్,డీజిల్,ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నందు సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు హరి, బాబావలి, గంగాధర్, మహబూబ్ బాషా మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ లపై 50 రూపాయలు ఒకేసారి పెంచి పేద ప్రజల పైన మోయలేని భారాన్ని వేశారన్నారు. పెంచిన పెట్రో ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను, రైతులను,కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు,నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట రాముడు, రాజు రావు, ఆరిఫ్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం, ఐద్వా ఆధ్వర్యంలో కదిరి అంబేద్కర్ సర్కిల్లో నిరసన తెలిపారు. గ్యాస్ సిలిండర్లను రోడ్డుపై ఉంచి నిరసన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్పై రూ.50 పెంపు దారుణం అన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల భారాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు మరింత భారాలు మోపడం సరికాదన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కదిరి పట్టణ కార్యదర్శి జిఎల్.నరసింహులు, నాయకులు జగన్మోహన్, బాబ్జాన్, ముస్తాక్, రామ్మోహన్, శివన్న, ఆంజనేయులు, నారాయణ, రఫీ, రమణమ్మ, మున్ని, సుధాకర్ రెడ్డి, శంకర్ రెడ్డి పాల్గొన్నారు.
చిలమత్తూరు :కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గురవారం మండల కేంద్రంలో నిరసన తెలిపారు. ‘మేము భారాలు మోయలేం’ అంటూ ఖాళీ గ్యాస్ సిలిండర్లను తలపై పెట్టుకుని, ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఫిరంగి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ధర్నాను ఉద్ధేశించి సిపిఎం మండల కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ ఒకేసారి రూ.50 పెంచి ప్రజలపై పెనుభారం మోపారన్నారు. మోడీ ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రామచంద్ర, మంజునాథ్, నరసింహ, చరణ్, భూమరెడ్డి, రహమత్తుల్లా, నాగరాజు, రజీయా బాను, సావిత్రమ్మ, ఆదిలక్ష్మమ్మ, నరసమ్మ, ఆంజి, ఆటో కార్మికులు రామాంజి, పాల్గొన్నారు.