కరపత్రాలను విడుదల చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు
చిలమత్తూరు : గ్రామపంచాయతీ, స్వచ్ఛ భారత్ కార్మికులు సమస్యలు పరిష్కారం కోసం ఈనెల 17న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని ఏపీ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రం, కోడూరు గ్రామ పంచాయతీల్లో చలో విజయవాడ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం కార్మికులతో కార్యాలయం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు ఏళ్ల తరబడి ప్రజలకు అనేక సేవలు అందిస్తూ పర్యావరణ కాపాడడంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. అలాంటి వారికి వేతనాలు పెంచకుండా బానిసలుగా తయారు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తమతీరును మార్చుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఎపి ప్రభుత్వం కూడా నేరుగా కార్మికుల ఖాతాల్లోకి వేతనాలు వేయాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వందలాది మంది కార్మికులను అక్రమంగా తొలగించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీ కార్మికుల ఉసేత్తడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ రామచంద్ర, రైతు సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, గ్రామపంచాయతీ కార్మికుల యూనియన్ నాయకులు గౌస్, చలపతి, రఫిక్, నరసింహప్ప, వేమారెడ్డి, నాగప్ప, ఆదిలక్ష్మి, రత్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.