ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత

హంద్రీనీవా కాలువను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

ప్రజాశక్తి-ఉరవకొండ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించే ప్రాంతాల్లో అడ్వాన్స్‌ సెక్యూరిటీ లైజన్‌ (ఏఎస్‌ఎల్‌) ద్వారా పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రి ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామంలో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ వెడల్పు పనులను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో ఛాయపురం గ్రామ పరిసరాలోల కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌, ఎస్పీ పి.జగదీష్‌లు ఎస్‌ఎస్‌జి ఆఫీసర్స్‌తో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి కాన్వారుకి సంబంధించిన రూట్‌ ను పరిశీలించారు. హెలిప్యాడ్‌, హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ వెడల్పు పనుల ప్రదేశాలు, సభా వేదిక ప్రదేశం, పార్కింగ్‌ స్ధలాలు వద్ద బందోబస్తు, భద్రత ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. హెలిప్యాడ్‌ను వెంటనే సిద్ధం చేసి మార్కింగ్‌ ఇవ్వాలన్నారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అంబులెన్స్‌, మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. హెలిప్యాడ్‌ వద్ద హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించేందుకు అవసరమైన గదిని ఏర్పాటు చేయాలన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువలో గురువారం మధ్యాహ్నంలోగా పనులన్నీ పూర్తిచేసి సిద్ధంగా ఉంచాలన్నారు. కాలువ వెడల్పు చేస్తే ఎలా ఉంటుంది, పనులు చేయకముందు ఎలా ఉంటుంది అనేది స్పష్టంగా తెలిసేలా పనులు చేయాలన్నారు. కాలువలో నీరు ఉండరాదని, చాలా వేగంగా పనులు పూర్తి చేయాలన్నారు. ప్రజావేదిక వద్ద ఏర్పాట్లను పూర్తిచేయాలని, సభలోకి విఐపిలు, ప్రజలు వచ్చిపోయేందుకు అవసరమైన దారులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజావేదిక వద్ద కంప చెట్లను తొలగించాలన్నారు. ఎస్పీ పి.జగదీష్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రదేశాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సచిన్‌ రహార్‌, సిఎంఒ కార్యాలయం అధికారులు దినేష్‌, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ అధికారులు ఎఎస్పి రమణమూర్తి, అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు, గుంతకల్‌ ఆర్డీవో శ్రీనివాసరెడ్డి, కళ్యాణదుర్గం ఆర్డీవో వసంత బాబు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఎస్‌ఈ రాజా స్వరూప్‌ కుమార్‌, ఆర్‌.అండ్‌.బి ఎస్‌ఈ రాజగోపాల్‌, మార్కెటింగ్‌ ఎడి సత్యనారాయణచౌదరి, సర్వే ఏడి రూప్ల నాయక్‌తో పాటు వివిధ శాఖల జిల్లా, మండలాధికారులు పాల్గొన్నారు.

➡️