వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
హిందూపురం : ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఈరేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ నాయకులు గురువారం స్థానిక ఎంఇఒ కార్యాలయం ముందు ఆందోళన చేసి ఎఇఒలు గంగప్ప, ప్రశన్న లక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఈరేష్ మాట్లాడుతు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల నిర్వహకులు ముందస్తు ప్రచారాలు, అడ్మిషన్లు నిర్వహిస్తున్నప్పటికి విద్యాశాఖ అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం పాఠశాలల నిర్వహకులు కేజీ నుండి పదవ తరగతి వరకు రూ.30 వేల నుంచి 50వేల రూపాయల వరకు విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. అయితే విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కూడా సరిగా కల్పించడం లేదన్నారు. ఫీజులతో పాటు ఇక్కడే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, బుక్స్, టై, బెల్టు కొనాలని నిబంధన పెట్టి రూ. 6 వేల నుంచి 12వేల రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. విద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిబందనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే విద్యాశాఖ అధికారులు మాముళ్లు తీసుకుని వారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నిబందనలు అతిక్రమిస్తున్న విద్యాసంస్థలపై అధికారులు చర్యలు తీసుకోక పోతే ఆలాంటి విద్యా సంస్థలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష దాడులు చేపడుతామనిదీనికి విద్యాశాఖ అధికారులే భాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఇస్మాయిల్, ఉమేష్, ఉజఫా, రజాక్ తదితరులు పాల్గొన్నారు.